కుక్కలా తిరిగానన్నారు: చిరంజీవిని ఏకిపారేసిన సబ్బం
విశాఖ/హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార సారథి చిరంజీవి పైన జై సమైక్యాంధ్ర పార్టీ నేత సబ్బం హరి గురువారం ఉదయం నిప్పులు చెరిగారు. చిరంజీవి కల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీ చుట్టు కుక్కలా తిరిగానని పార్లమెంటు సెంట్రలు హాలులో చిరంజీవి తనతో అన్నారని చెప్పారు.
రాజీనామా చేస్తానని చెప్పి 72 గంటల పాటు కనిపించకుండా పోయాడని విమర్శించారు. చిరంజీవి అబద్దాలు ఆడటం మానుకోవాలని హితవు పలికారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లుగా ఆయన వ్యవహారం ఉందన్నారు. మరోవైపు విభజన విషయంలో అధికారులపై గవర్నర్ ఒత్తిడి చేయవద్దని హితవు పలికారు. కోర్టులను ప్రభావితం చేసే దిశలో గవర్నర్ చర్యలు ఉన్నాయన్నారు.
విశాఖ నుండి స్థానికేతరులు పోటీ చేస్తే తాను కూడా జై సమైక్యాంధ్ర పార్టీ నుండి బరిలో దిగుతానని చెప్పారు. నాలుగైదు రోజుల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.
చిరు వ్యాఖ్యలపై తులసి రెడ్డి నిప్పులు
రాష్ట్ర విభజన శుభ పరిణామమంటూ చిరంజీవి వ్యాఖ్యానించడం పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని జై సమైక్యాంధ్ర పార్టీ ప్రధాన కార్యదర్శి తులసి రెడ్డి హైదరాబాదులో నిప్పులు చెరిగారు. చిరంజీవి నిజస్వరూపం బయటపడిందన్నారు. రాష్ట్రాన్ని విభజించవద్దని ఉద్యమం చేసిన ప్రజలు, నాయకులు తెలివి తక్కువ వారు అన్నట్లుగా చిరు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.