లగడపాటిపై షబ్బీర్ ఫైర్: మల్కాజిగిరిలో ఎక్కువ రౌండ్లు
హైదరాబాద్: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పైన షబ్బీర్ అలీ గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన బోగస్ ఆస్తులను కాపాడుకునేందుకే లగడపాటి టిడిపితో కుమ్మక్కయ్యారని, ఆ పార్టీకి అనుకూలంగా సర్వేలు ఇచ్చారన్నారు. కాంగ్రెసు పార్టీకి తెలంగాణలో 50-55 సీట్లు వస్తాయని చెప్పారు. కామారెడ్డి ప్రాంతాన్ని తాము సిద్దిపేటలో కలవనివ్వమన్నారు. లగడపాటి సర్వే బోగస్ అన్నారు.
ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రహస్య మంతనాలు జరుపుతున్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రహస్యంగా సమావేశమై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
మల్కాజిగిరిలో 45 రౌండ్లు
శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుందని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ చెప్పారు. మల్కాజిగిరి లోకసభకి 45 రౌండ్లు, అనకాపల్లి లోకసభకు 18 రౌండ్లు ఉంటాయి. కూకట్పల్లి అసెంబ్లీకి 45 రౌండ్లు, చార్మినార్ అసెంబ్లీకి 13 రౌండ్లు లెక్కింపు ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా 189 మంది కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఉంటారు. ప్రతి కేంద్రం వద్ద మైక్రో అబ్జర్వర్ ఉంటుంది. ప్రతి లెక్కింపు కేంద్రం వద్ద ఇద్దరు మైక్రో అబ్జర్వర్లు ఉంటారు.
25వేల మంది సిబ్బంది లెక్కింపులో పాల్గొంటుంది. గురువారం అర్ధరాత్రి నుండి శుక్రవారం అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు బంద్. 78 ప్రాంతాల్లో 168 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 437 కౌంటింగ్ కేంద్రాల్లో 6,995 టేబుల్స్ ఏర్పాటు చేశారు. లోకసభ స్థానానికి మన రాష్ట్రం నుంచి 598 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు.