కేటీఆర్కు హెచ్చరిక: తెరాసను ఏకిపారేసిన షబ్బీర్, సారీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ఉస్మానియా విద్యార్థులు ఉదయం అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో పోలీసులు విద్యార్థులను అరెస్టు చేశారు. తాము న్యాయం కోసం పోరాడుతుంటే అరెస్టు చేయడమేమిటని, ఇలా నిరంకుశంగా వ్యవహరిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను అరెస్టు చేయడంపై కాంగ్రెసు నేతలు వేర్వేరుగా స్పందించారు.
న్యాయమే: యాష్కీ
ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు చేస్తోంది న్యాయపోరాటమని మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. ఆయన గాంధీభవన్లో మాట్లాడారు. విద్యార్థులతో చర్చించకుండా లాఠీఛార్జ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు.
విద్యార్థులపై లాఠీఛార్జ్ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఓయూ విద్యార్థుల ఉద్యమానికి మద్దతునిస్తున్నామని, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, విద్యార్థులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. విద్యార్థులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని మరో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.
క్షమించండి: షబ్బీర్ అలీ
కొత్త ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవద్దనే ఉద్దేశ్యంతోనే తాము ఓయు విద్యార్థులకు మద్దతు ప్రకటించడం లేదని, ఇందుకు విద్యార్థులకు తాను క్షమాపణలు చెబుతున్నానని షబ్బీర్ అలీ అన్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ విద్యార్థులపై లాఠీఛార్జ్ జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే తమ ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. వారి ఆందోళన సబబే అన్నారు.
తమ హక్కుల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం చాలా సరికాదన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన విద్యార్థులను అగౌరవ పరిచేలా హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. విద్యార్థుల త్యాగాలతోనే సీఎం, హోంమంత్రి పదవులు అనుభవిస్తున్నారన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. విద్యుర్థులపై వెంటనే కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.