సీబీఐ కోర్టులో జగన్ కేసు విచారణకు హాజరైన సబిత, ధర్మాన: జగన్ కు వ్యక్తిగత మినహాయింపు.. రీజన్ ఇదే
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ నేడు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో కొనసాగుతుంది. సీఎం జగన్ ఆస్తుల కేసులో ఇవాళ సీబీఐ కోర్టుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద్ రావు, ఎంపీ విజయసాయి రెడ్డి లు హాజరయ్యారు. విచారణ కొనసాగుతుంది.కానీ నేడు జగన్ కు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చింది కోర్టు .
పెన్నా సిమెంట్ వ్యవహారంలో కోర్టుకు హాజరైన తెలంగాణా మంత్రి సబిత, మాజీ మంత్రి ధర్మాన
పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో 2013లో సీబీఐ అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయగా కోర్టు ఇటీవల పరిగణలోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన, పెన్నాప్రతాప్రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. అనంతపురం జిల్లాలో 230 ఎకరాలు, కర్నూల్లో 304 హెక్టార్లు, రంగారెడ్డి జిల్లాలోని తాండూరులో గనుల కేటాయింపులపై అవకతవకలు జరిగాయని సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ నేపధ్యంలో వారు కోర్టు ఎదుట హాజరయ్యారు.
నేడు వ్యక్తిగత హాజరు నుండి జగన్ కు మినహాయింపు
అయితే ఈరోజు విచారణకు వ్యక్తిగత హాజరు నుండి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జగన్ కు మినహాయింపు ఇచ్చింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తో హైపవర్ కమిటీ భేటీ అయ్యింది. రాజధాని నివేదికలు, పాలనా వికేంద్రీకరణ విషయంలో పలు అంశాలను కమిటీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి వివరిస్తుంది. ఈ సమావేశం ఉన్న కారణంగానే సీఎం జగన్ కు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చినట్టు తెలుస్తుంది.
వచ్చే వారం తీర్పు ..ఈడీ కేసుల్లో జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు వస్తుందా ?
ఇదిలా ఉండగా ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ గతంలో పిటిషన్ వేశారు. అలాగే గతంలోని డిశ్చార్జ్ పిటిషన్లు అన్నింటిని కలిపి విచారించాలని కూడా వేసిన పిటిషన్లపై వాదనలు గత వారం పూర్తయ్యాయి. వాటిపై వచ్చేవారం తీర్పు రానుంది.ఇప్పటికే సీబీఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత మినహాయింపును కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈడీ కేసులో వేసిన పిటిషన్పై ఆసక్తి వ్యక్తమవుతోంది. జగన్కు ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు లభిస్తుందా? అన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.