తెరాసలోకి కుమారుడితో సహా సబితా ఇంద్రారెడ్డి?
న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మాజీ హోం మంత్రిగా పనిచేసిన తెలంగాణ మహిళా సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులోభాగంగానే ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భవిష్యత్ కార్యాచరణ సదస్సుకు ఆమెతో పాటు ఆమె తనయుడు కార్తీక్ రెడ్డిలు డుమ్మా కొట్టారని అంటున్నారు.
వీరిద్దరితో పాటు పలువురు జిల్లా నేతలు కూడా సదస్సుకు గైర్హాజరు అయ్యారు. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డితో పాటు ఆమె వర్గంగా పేరొందిన పలువురు నాయకులు సదస్సుకు డుమ్మా కొట్టారు.
పార్టీకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానంటూ ఇటీవలి జరిగిన పలు సమావేశాల్లో సబితా ఇంద్రారెడ్డి చెప్పినప్పటికీ తాజా సదస్సుకు దూరంగా ఉండటంపై అక్కడి నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
సబితా ఇంద్రారెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్నారు. ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి చేవెళ్ల లోకసభ స్థానం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి తెరాస అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డిపై ఓటమి పాలయ్యారు.