ఫ్రెండ్ ముందు అవమానమని ఎయిర్ హోస్టెస్ రీతు హత్య: భర్త శాడిస్ట్
హైదరాబాద్: మాజీ ఎయిర్ హోస్టెస్ రీతును ఆమె అత్తింటి వారు వేధించే వారని రీతు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. తొలుత రీతు, భర్త సచిన్లు అత్తింటి వారితో కలిసి ఉండేవారని, ఆ సమయంలో వేధించారని చెప్పారు.
సచిన్ అదనపు కట్నం కోసం వేధించాడని చెప్పారు. ఆ సమయంలో రీతు గర్భవతి అని, ఆమె భవిష్యత్తు దృష్ట్యా తాము ఏం మాట్లాడలేకపోయామని చెప్పారు. రీతు గర్భవతిగా ఉన్నప్పుడు సచిన్ తిండి విషయంలోను ఇబ్బందులు పెట్టారని చెప్పారు. అతను చాలా శాడిస్ట్ అని ఆరోపించారు. పోలీసులు రీతు భర్త సచిన్ పైన అదనపు కట్నం, హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
కాగా, మాజీ ఎయిర్ హోస్టెస్ రీతూ మృతి కేసును పోలీసులు చేధించిన విషయం తెలిసిందే. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా, ఆమెను భర్తనే హత్య చేశారని తెలుస్తోంది. వారి మధ్య రిమోట్ కోసం గొడవ జరిగింది. భార్య రీతు, భర్త సచిన్ మధ్య ఆ రోజు రిమోట్ కోసం గొడవ జరిగింది.
ఆ గొడవ కూడా భర్త స్నేహితుడు రాకేష్ ముందు జరిగింది. తన స్నేహితుడి ముందు తన భార్య తనను అవమానించిందనే ఆగ్రహంతో రీతును భరత్ హత్య చేశాడు. భర్త సచిన్ తన భార్య రీతు గొంతును దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి చేశాడు. దీంతో ఆమె చనిపోయింది.
కాగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం రీతు అనే మాజీ ఎయిర్ హోస్టెస్ తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే.
స్థానికులు దీనిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్లో జరిగింది. స్థానికంగా ఇది సంచలనం సృష్టించింది.