దత్తత: పుట్టంరాజు కండ్రిగను పరిశీలించిన సచిన్ సిబ్బంది, అసంతృప్తి
నెల్లూరు: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న పుట్టంరాజువారికండ్రిగలో గురువారం ఆయన సిబ్బంది, అధికారులు పరిశీలించారు. ముందస్తు సమాచారం లేకుండా వచ్చి గ్రామంలో జరుగుతున్న పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు.
గ్రామంలో వేసిన సిమెంట్ దారులను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. రహదారులు పూర్తిగా అపరిశుభ్రంగా ఉండటంతో ఇక్కడ శుభ్రం చేయరా? అంటూ స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
సచిన్ టెండూల్కర్ ఎంపీ నిధులతో నిర్మిస్తున్న క్రీడా మైదానం, సామాజిక భవనం, అంగన్వాడీ భవనం, భోజనశాల, గ్రామచెరువు ఆధునికీకరణ తదితరాలను పరిశీలించి ఫొటోలను తీసుకున్నారు.
సెప్టెంబర్ 23న జాతీయ స్థాయి ఉత్తమ అవార్డు కోసం జరిగే ఆదర్శ గ్రామాల అభివృద్ధిపై చిత్ర సమర్పణలో భాగంగా వీరిక్కడికి వచ్చినట్లు తెలిసింది. వీరు గ్రామస్థులతో నేరుగా ముచ్చటించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.
సచిన్ సిబ్బంది దాదాపు రెండు గంటల పాటు గ్రామంలో విస్తృతంగా పర్యటించింది. బృందం వెంట సీపీవో డీడీ వెంకయ్య, గృహనిర్మాణ, పంచాయతీరాజ్ శాఖల డీఈలు నిరంజన్, గిరినాథ్ తదితరులు ఉన్నారు.