నెల్లూరు జిల్లాలో సచిన్కు రెండెకరాలు: పాస్ పుస్తకానికి ఆర్జీ
నెల్లూరు: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. నెల్ూరు జిల్లా తడ మండలం కాదలూరు గ్రామానికి చెందిన వి. మునికృష్ణయ్యకు సర్వే నెం.263/2 (బీ)లో రెండెకరాల పట్టాభూమి ఉండేది. దీన్ని 2006లో సచిన్ టెండూల్కర్కు విక్రయించినట్లు గతంలో వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ఆ భూమికి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని కోరుతూ ‘మీసేవ'ద్వారా సచిన్ అర్జీ పెట్టుకున్నారు. దీన్ని పరిశీలించిన రెవెన్యూ అధికారులు ఆ రెండెకరాలు సచిన్కు చెందినదిగా నిర్ధారించారు. ఈ భూమికి పట్టా నెంబరు 456, పట్టాదారు పాసుపుస్తకం 09వై 46ఎస్ 005000008 నెంబర్లను కేటాయిస్తూ ఆన్లైన్ పాసుపుస్తకం జారీ అయింది.
పట్టాదారు పాసుపుస్తకం ముద్రణకు చెన్నై పంపించినందున అక్కడినుంచి రాగానే సచిన్కు అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. టెండూల్కర్ కుటుంబ సభ్యులకు కూడా తడ మండలంలోనే పలుచోట్ల దాదాపు 10 ఎకరాల భూములున్నాయని ప్రచారం సాగుతోంది.
కానీ, వాటికి సంబంధించి పట్టాదారు పాస్పుస్తకాల కోసం అర్జీలు అందలేదని తెలిసింది. నెల్లూరు జిల్లా గూడూరు మండలం పుట్టంరాజు కండ్రిగ అనే గ్రామాన్ని టెండూల్కర్ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.