సింగపూర్ లో చంద్రబాబుతో సచిన్ టెండూల్కర్ సమావేశం
సింగపూర్,అమరావతి:సింగపూర్ లో చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం సింగపూర్ టూర్ లో ఉన్న ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అక్కడ ఎపి సిఎంచంద్రబాబుతో సమావేశమయ్యారు.చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అనంతరం ఎపిలో తాను
దత్తత తీసుకున్న గ్రామాభివృద్ధి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించినట్లు తెలిసింది. సచిన్ నెల్లూరు జిల్లాలో పుత్తరాజుకండ్రిక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ది కార్యక్రమాలు చేపడుతుండగా, అదే గ్రామంలో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టే విషయమై సచిన్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారం కోరినట్లుగా తెలుస్తోంది. అయితే వీరిద్దరి భేటీ ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదని సిఎం చంద్రబాబు అక్కడ ఉన్నారని తెలిసి సచిన్ మర్యాదపూర్వకంగా కలిసి విష్ చేయడానికి వచ్చారని ఎపి ప్రతినిధులు తెలిపారు.
అంతకుముందు సిఎం చంద్రబాబు సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయం హిందుస్తాన్ టైమ్స్ మింట్ ఆసియా లీడర్షిప్ సమిట్ ప్రారంభానికి ముందు చంద్రబాబు సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో కలిసి అల్పాహరం స్వీకరించారు. అనంతరం అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నచంద్రబాబు రాజధాని అమరావతి గురించి ప్రసంగించారు. తనకు సైబరాబాద్ వంటి నగరాన్ని నిర్మించిన అనుభవం ఉందని, అయితే కొత్త రాజధానికి భూమిని సమకూర్చుకోవడమే పెద్ద సవాల్ అని చెప్పారు.
అమరావతి నిర్మాణం సందర్భంగా తాను సింగపూర్ తరహా నగరాన్ని నిర్మిస్తాననే చెప్పానన్నారు. రైతులు ప్రభుత్వానికి 33 వేల ఎకరాల భూములు ఇచ్చారని, 6 నెలల్లోనే సింగపూర్ ప్రభుత్వం ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ ఇచ్చిందన్నారు. రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల నిర్మాణాన్ని చేపట్టామని, రాజధాని ప్రణాళికలు, ఆకృతుల రూపకల్పనకు ప్రపంచంలోనే అత్యుత్తమ కన్సల్టెంట్లను నియమించుకున్నామని చంద్రబాబు వారికి వివరించారు.