తాము చనిపోయి...ఊరిని బతికించారు:మృత్యువులోనూ వీడని స్నేహ బంధం
అనంతపురం:వారిద్దరూ ప్రాణ స్నేహితులు...వయసు అంతరం ఉన్నా ఆప్తమిత్రులుగానే మెలిగేవాళ్లు...ఆ ఊరికి ఏ కష్టమొచ్చినా సాయం అందించేందుకు తామున్నామంటూ ముందుకొచ్చేవారు...తమ గ్రామానికి గట్టి సమస్య ఏదైనా ఎదురైతే దాని పరిష్కారం కోసం తపించిపోయేవాళ్లు...
అలాంటి సేవాతత్పరులకు వారి పరోపకార బుద్దే యమపాశంగా మారింది. ఊరికి ఎదురైన విపత్తును తప్పించే క్రమంలో తమ ప్రాణాలే బలివ్వాల్సి వచ్చింది... అయితేనే చనిపోతూ కూడా తమ గ్రామాన్ని భయంకర ప్రమాదం నుంచి కాపాడారు...అలాగే మరణంలోనూ తమ స్నేహ బంధాన్ని వీడలేదు... తమ ఊరు ఉన్నంత వరకూ ఆ గ్రామ చరిత్రలో త్యాగమూర్తులుగా నిలిచిపోయే ఇద్దరు ఆప్తమిత్రుల విషాద గాథ ఇది...వివరాల్లోకి వెళితే
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటవేముల గ్రామానికి చెందిన పొత్తూరి బాలరంగయ్య (32), చాకల పెద్ద ఓబుళపతి(56) ఇద్దరూ గ్రామంలో ఏ సమస్య వచ్చినా తామే ముందుండి పరిష్కరించేవారు. సోమవారం అర్థరాత్రి ఈదురుగాలుల కారణంగా ఒక వీధిలో విద్యుత్తు తీగ తెగిపడింది. మంగళవారం ఉదయమే వీటిని గమనించిన బాలరంగయ్య-పెద్దఓబుళపతి ఆ తీగను గ్రామస్థులు ఎవరూ ముట్టుకోవద్దని చాలా ప్రమాదమని చెప్పారు.
ఆ తరువాత పడిపోయిన విద్యుత్తు తీగను తొలగించేందుకు ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి ఫ్యూజులను తొలగించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం ఆ విద్యుత్ తీగను పక్కకి తొలగించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో అకస్మాత్తుగా ఆ తీగలోకి విద్యుత్తు సరఫరా జరగడంతో వీరికి విద్యుత్ ఘాతానికి గురవడంతో పాటు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వీరి శరీరాలు 80 శాతం పైనే కాలిపోయాయి. అక్కడికక్కడే విలవిల్లాడుతూ చనిపోయారు. తమ ఎదుటే రెండు నిండిప్రాణాలు మండిపోయి మాడి మసై మృత్యువాతన పడటంతో గ్రామస్థులు దిగ్బ్రాంతి చెందారు. జరిగిన ఘోరంతో ఊరు ఊరంతా కన్నీటి సంద్రంలో మునిగిపోయింది.
గ్రామంలో పొత్తూరి బాలరంగయ్య, పెద్ద ఓబుళపతి వీరిద్దరూ అందరి తలలో నాలుకలా మెలుగుతూ ఊరి అవసరాలన్నీ తీర్చేవారని గ్రామస్థులు చెబుతున్నారు. మోటార్ల రిపేర్లు, అన్ని రకాల కరెంట్ కష్టాలు, తాగునీరు, సాగునీరు...ఇలా ఏ సమస్య ఎదురైనా తమకు చేతనైనంత సాయం చేసేవారిని...ఒక్కమాటలో చెప్పాలంటే వీరిద్దరూ ఊరికి పెద్ద అండ అని గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే ప్రాణ స్నేహితులైన వీళ్లు మృత్యువులోనూ వీడనిబంధంగానే వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మృతుల్లో బాలరంగయ్య అవివాహితుడు కాగా పెద్ద ఓబుళపతికి పెళ్లయి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుల కుంటుంబ సభ్యలతో పాటు ఊరు ఊరంతా వీరి మరణంపై రోదిస్తున్న తీరు గుండెలను కలచివేస్తోంది. ఎస్సై సురేష్బాబు వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. తీగలోకి విద్యుత్ ప్రవహించడం వెనుక ఏదైనా కుట్ర ఉందేమో నన్న కోణంలో కూడా విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.