మాది నిజమైంది, టిడిపికి సదావర్తి షాక్: వాసిరెడ్డి పద్మ, రూ.60 కోట్లు పెట్టొచ్చని కడపవాసి
సదావర్తి భూముల వేలంకు అనూహ్య స్పందన లభించడం శుభపరిణామమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సోమవారం అన్నారు.
అమరావతి: సదావర్తి భూముల వేలంకు అనూహ్య స్పందన లభించడం శుభపరిణామమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సోమవారం అన్నారు.
రికార్డు ధరకు సదావర్తి భూములు: దక్కించుకున్న కడపవాసి, పోటాపోటీగా వేలం..
అందుకే కోర్టుకు వెళ్లాం
తొలి నుంచి తాము చెబుతున్నదే ఈ రోజు జరిగిందని పద్మ అన్నారు. ప్రభుత్వ భూమిని అప్పనంగా కాజేయాలని టిడిపి నాయకులు చూశారని ఆమె ఆరోపించారు. అలా జరగకూడదని తాము కోర్టును ఆశ్రయించామన్నారు. ఇది టిడిపికి గట్టి షాక్ అని అభిప్రాయపడ్డారు.
Recommended Video
సదావర్తి భూముల
ఈ రోజు జరిగిన వేలంలో సదావర్తి భూములకు గరిష్ట ధర పలకడం హర్షణీయమని వాసిరెడ్డి పద్మ అన్నారు. సదావర్తి సత్రం భూముల విషయంలో న్యాయం గెలిచిందని, ఇది కచ్చితంగా వైసిపి విజయమని న్యాయవాది సుధాకర్ రెడ్డి చెన్నైలో అన్నారు. వేలం వివరాలను సుప్రీం కోర్టుకు నివేదిస్తామని, కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ తెలిపారు.
రూ.60 కోట్లు పెట్టవచ్చు
ఇదిలా ఉండగా, తమ శక్తి మేరకే బహిరంగ వేలంలో పాల్గొన్నామని సదావర్తి సత్రం భూములను దక్కించుకున్న సత్యనారాయణ బిల్డర్స్ తెలిపారు. ఆ భూములకు రూ.60.30 కోట్లు చెల్లించడం సమంజసమే అన్నారు. 48 గంటల్లో సగం డబ్బును డిపాజిట్ చేస్తామన్నారు. అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే బహిరంగ వేలంలో పాల్గొన్నామన్నారు. వేలంలో సదావర్తి భూములను కడప జిల్లాకు చెందిన సత్యనారాయణ దక్కించుకున్నారు.
ఇదీ సదావర్తి చరిత్ర
కాగా, గుంటూరు జిల్లా అమరావతిలో రాజా వాసిరెడ్డి వంశీయులు వేద విద్యను అభ్యసించే వారికి చేయూతనందించాలనే ఉద్దేశ్యంతో సత్రాలు ఏర్పాటు చేశారు. భక్తులు, యాత్రికులు బస చేసేందుకు ఇవి ఉపయోగపడ్డాయి. రాజా వాసిరెడ్డి వంశీయులు సేవా నిరతిని మెచ్చిన పలువురు సంపన్నులు సదావర్తి సత్రానికి భారీగా భూములు, నగదు విరాళాలు ఇచ్చారు. అందులో భాగంగా తమిళనాడులోని మహాబలిపురం రహదారిని ఆనుకొని ఉన్న తాళంబూర్లో సదావర్తి సత్రం కోసం 471 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు.