సదావర్తి ఎన్నో ట్విస్ట్లు: జగన్ పార్టీపై బాబు ఫైర్, చరిత్ర అంతా చెప్పిన అనురాధ
సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో విమర్శలు చేస్తున్న వైసిపిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములపై ఆసక్తి ఉంటే వైసిపి నేతలు ముందే వేలంలో పాల్గొని ఉండవచ్చును కదా అని నిలదీశారు.
అమరావతి: సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో విమర్శలు చేస్తున్న వైసిపిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములపై ఆసక్తి ఉంటే వైసిపి నేతలు ముందే వేలంలో పాల్గొని ఉండవచ్చును కదా అని నిలదీశారు.
జగన్ సాక్షి ఎఫెక్ట్... మాకొద్దు, భయమేస్తోంది: సదావర్తి భూములపై కొత్త ట్విస్ట్
కావాలనే రచ్చ, రెండోసారీ వివాదం
సదావర్తి భూముల వ్యవహారంపై వైసిపి నేతలు కావాలనే రచ్చ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఈ భూముల విషయంలో దేవాదాయ శాఖ నిజాయితీగా వ్యవహరించి, ముందుగానే వేలంపై ప్రచారం నిర్వహించిందని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు రెండోసారి వేలం అయ్యాక కూడా వివాదం కొనసాగిస్తున్నారన్నారు. భూవివాదాలు ఎలా ఉంటాయే సదావర్తి వ్యవహారమే ఉదాహరణ అని, ఆ భూముల చరిత్ర చెప్పాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధను ఆదేశించారు.
ఇవీ సదావర్తి పూర్వాపరాలు
చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో అనురాధ భూముల పూర్వాపరాలను వివరించారు. వాసిరెడ్డి లక్ష్మమ్మ అనే మహిళ చనిపోతూ తన 400 ఎకరాలూ సదావర్తి సత్రానికి చెందాలని విల్లు రాశారని, ఆ భూములు తమవని, తాము లక్ష్మమ్మకు తాకట్టు పెట్టామని, ఆ భూములపై హక్కులు ఇప్పించాలని కొందరు కోర్టుకెళ్లారని, లక్ష్మమ్మ వారసులు తమకు పట్టా ఇవ్వాలని తమిళనాడు రెవెన్యూ శాఖను అడిగారని, తమిళనాడు ప్రభుత్వం ఒప్పుకోలేదని, వారు చెంగల్పట్టు కోర్టుకు వెళ్లినా కుదరలేదని అనురాధ వివరించారు.
భూముల గురించి అడిగితే ఇదీ తమిళనాడు సమాధానం
ఇదంతా 1887-1905 మధ్య కాలంలో జరిగిందని అనురాధ తెలిపారు. ఆ తర్వాత 1961లో ఏపీ ప్రభుత్వం కేసు వేసిందని, 2000వ సంవత్సరం నుంచి మళ్లీ దీనిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయని, 2013లో అప్పటి సీఎం ఒక బృందాన్ని మళ్లీ తమిళనాడు పంపించారని, తమిళనాడు ప్రభుత్వాన్ని భూములివ్వాలని కోరారని, అయితే ఎస్టేట్లను రద్దు చేశామని, ఆ భూములన్నీ ప్రభుత్వానివేనని తమిళనాడు సమాధానం ఇచ్చిందని తెలిపారు.
ఆ ఒక్క ఆధారం, కోర్టు కేసు కొట్టేసింది
ఆ 400 ఎకరాల్లో చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయని, కేవలం 83.11 ఎకరాలు మాత్రం ఎవరి అధీనంలో లేకుండా ఉందని, దానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం కోర్టు ఇచ్చిన డిక్రీ మాత్రమనని అనురాధ వెల్లడించారు. వేలం వేస్తే ఎంతో కొంత వస్తుందనుకున్నామని, సుమారు రూ.22 కోట్లకు వేలంలో వాడుకున్నారని, ఆ తర్వాత ఒకరు కేసు వేసారని ఆమె తెలిపారు. దాన్ని కోర్టు కొట్టి వేసిందన్నారు.
ఆళ్ల మళ్లీ కేసు వేశారు, అక్కడ ట్విస్ట్
దీనిపై ఆళ్ల రామకృష్ణా రెడ్డి మళ్లీ కేసు వేశారని అనురాధ తెలిపారు. రూ.5 కోట్లు ఎక్కువ ఇస్తే తీసుకోవచ్చునని చెప్పామని, ఆయన ముందు తటపటాయించినా తర్వాత రూ.27కోట్లు చెల్లించారని చెప్పారు. దీనిపై మొదటి వేలంలో పాడుకున్న వ్యక్తి మళ్లీ కోర్టుకెళ్లారని, తాను వేలంలో పాడి రూ.22 కోట్లు చెల్లించి ఏడాదిన్నర అయిందని, ఆ కాలానికి వడ్డీ కలిపితే సుమారు రూ.30 కోట్లు అవుతుందని పిటిషన్ వేశారని తెలిపారు.
అందుకే సత్యనారాయణ బిల్డర్స్ వదిలేసింది
రూ.27 కోట్లకే ఇవ్వడం ఏమిటని, మళ్లీ వేలం వేయాలని అడిగారని అనురాధ సీఎం చంద్రబాబుకు వివరించారు. దేవాదాయ శాఖ మళ్లీ వేలం వేసిందని చెప్పారు. అందులో రూ.62.30 కోట్లకు సత్యనారాయణ బిల్డర్స్ పాడారని, వైసిపి నుంచి విమర్శలు వస్తున్నాయని, డబ్బు చెల్లించినా వివాదాల్లో పడితే ఇబ్బందులు వస్తాయని వారు వదిలేశారని తెలిపారు.
ఈలోగా కోర్టుకెక్కిన తమిళనాడు
రెండో బిడ్డర్ రూ.62.25 కోట్లకు పాట పాడారని అనురాధ తెలిపారు. మొదట వేలంలో పాడి చెల్లించిన రూ.22 కోట్లు, ఆళ్ల రామకృష్ణారెడ్డి చెల్లించిన రూ.27 కోట్లు ఇప్పుడు ప్రభుత్వ ఖాతాలోనే ఉన్నాయని, మూడోసారి పాడిన సత్యనారాయణ బిల్డర్స్ చెల్లించిన రూ.10 లక్షల డిపాజిట్ కూడా ప్రభుత్వం దగ్గరే ఉందని, జరిగిన పరిణామాలన్నీ సుప్రీంకోర్టుకు చెప్పామని అనురాధ చెప్పారు. శుక్రవారం అక్కడ విచారణ జరగనుందని, అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు నడుచుకోవాలని, ఈలోపు తమిళనాడు ప్రభుత్వం కూడా ఆ భూమిపై హక్కులు తమవేనని కేసు వేసిందని ఆమె వివరించారు.