ఎమ్మెల్యే ఆళ్లకి రూ.27.44కోట్లు తిరిగిచ్చేయండి : హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: సదావర్తి సత్రం భూముల వేలం వివాదంపై వ్యాజ్యంలో మంగళగిరి వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) జమచేసిన రూ.27.44కోట్ల సొమ్మును రెండు వారాల్లో వెనక్కిచ్చేయాలని ఏపీ సర్కారును హైకోర్టు ఆదేశించింది.
సదావర్తి భూములు తమకు చెందినవని తమిళనాడు చెబుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ అభినంద్కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం సదావర్తి భూములు తమకు చెందినవని వాదన లేవనెత్తిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఏపీ సర్కారును ఆదేశించింది.
విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది. అంతిమంగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరి గత వేలాన్ని రద్దుచేసింది. ఆ భూమి హక్కులు ఎవరివో తేల్చాలని హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాను జమచేసిన సొమ్మును వెనక్కిప్పించాలంటూ ఆర్కే హైకోర్టులో అనుబంధ పిటీషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే ఆ సొమ్మును వెనక్కి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
అంతకుముందు సదావర్తి సత్రానికి చెన్నైలో ఉన్న 83 ఎకరాల అత్యంత విలువైన భూమిని ప్రభుత్వం కావాల్సిన వారికి నామమాత్రపు ధరకే కట్టబెట్టిందని, దీని వల్ల వందల కోట్ల రూపాయల మేర ఖజానాకు నష్టం వాటిల్లిందని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ రామకృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిల్ను విచారించిన ధర్మాసనం.. ఈ వ్యాజ్యం దాఖలుకు వెనుక ఉన్న సదుద్దేశాలను నిరూపించుకునేందుకు రూ.27.44 కోట్లు డిపాజిట్ చేయాలని ఆళ్లను ఆదేశించింది. ఆ మేరకు ఆయన దేవాదాయ శాఖ కమిషనర్ వద్ద డిపాజిట్ చేశారు.
ఏపీవే సదావర్తి భూములు..
సదావర్తి భూములు ఆంధ్రప్రదేశ్కే చెందుతాయని రుజువు చేసేందుకు అవసరమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధ చెప్పారు. ఈ విషయంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.