చంద్రబాబుకు 'సదా' చిక్కులు, ఇరుకున పెట్టేందుకు జగన్ యత్నం
చెన్నై: సదావర్తి సత్రం భూముల అంశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ను చిక్కుల్లో పెట్టేందుకు వైసిపి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా చెన్నైలోని సదావర్తి భూముల ప్రాంతాన్ని వైసిపి నేత ధర్మాన ప్రసాద రావు బృందం ఆదివారం సందర్శించింది.
చెన్నై పాలంబూరులోని సదావర్తి సత్రం భూములను సందర్శించిన అనంతరం ధర్మాన మాట్లాడారు. సదావర్తి సత్రం భూములను మూడో కంటికి తెలియకుండా టిడిపి నేతలు కొట్టేశారని ఆరోపించారు. మొత్తం 83 ఎకరాల భూమిని టీడీపీ నేతలు స్వాహా చేశారన్నారు.
బహిరంగ మార్కెట్ ప్రకారం ఎకరా విలువ రూ.10 కోట్లు ఉండగా, తమ అనుచరులకు రూ.27 లక్షలకే ప్రభుత్వం కట్టబెట్టిందన్నారు. ఈ విషయం తెలిసిన సీఎం చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు పెదవి విప్పాలన్నారు.
సత్రం భూముల అమ్మకాల్లో నారా లోకేష్ ప్రమేయం ఉందా?, సత్రం భూముల వేలాన్ని రద్దు చేస్తే ఇబ్బందేంటి? అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. సత్రం భూముల వేలాన్ని రద్దు చేయాలని అందరూ కోరుతున్నారని, వెయ్యికోట్లకు పైగా దోపిడీ జరిగిన విషయం స్పష్టంగా బయటపడుతోందన్నారు.
ఈ విషయమై ముఖ్యమంత్రి, మంత్రి మాణిక్యాల రావు వెంటనే స్పందించాలన్నారు. రూ.6.5 కోట్ల భూమిని అతి చౌకకు కొట్టేశారన్నారు. దీనిపై జాతీయస్థాయిలో న్యాయపోరాటం చేస్తామన్నారు.
సదావర్తి భూములపై నిజనిర్ధారణ కమిటీ నివేదికను జగన్కు అందిస్తామని, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. భూముల వేలం రద్దు చేస్తే ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. కాగా, సదావర్తి భూముల అంశం ద్వారా చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.