చిరంజీవిని టార్గెట్ చేసిన సాధినేని యామిని: జగన్ తో చిరు అండ్ టీమ్ భేటీ కేవలం వ్యాపార లావాదేవీలకే !!
బిజెపి మహిళా నాయకురాలు సాధినేని యామిని శర్మ సినీ పరిశ్రమ వర్గాలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా సీఎంతో భేటీ అయిన వాళ్ళు పక్కాగా వారి లావాదేవీలు మాట్లాడుకోవడానికి వచ్చారని సాధినేని యామిని ఆరోపిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ తో సినీ ప్రముఖులు భేటీ అవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆమె సినిమా హీరోలు నిజ జీవితంలో కనీసం మనుషుల్లా కూడా ప్రవర్తించటం లేదంటూ సాధినేని యామిని విమర్శించారు.
ఏపీ సీఎం జగన్ తో సినీ వర్గాల భేటీ .. చిరంజీవికి రాజధాని రైతుల నిరసన సెగ
తాజాగా కరోనా లాక్డౌన్ నేపథ్యంలో సినీ పరిశ్రమ కూడా షట్ డౌన్ పాటిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో షూటింగ్ ల కొనసాగింపు, థియేటర్ల ప్రారంభం తదితర సినీపరిశ్రమ సమస్యలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో చర్చించారు చిరంజీవి, నాగార్జునతో పాటుగా సినీ పరిశ్రమ వర్గాలు.ఈ సమయంలో చిరంజీవికి రాజధాని రైతుల నుండి నిరసన సెగ తగిలింది. అయినప్పటికీ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోని చిరంజీవి సీఎం జగన్ తో భేటీ అయ్యి చర్చించారు. ఇక ఈ నేపథ్యంలో సాధినేని యామిని చిరంజీవిపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఖైదీ నెంబర్ 150లో రైతుల కోసం చిరు చూపించిన స్ఫూర్తి ఏమైందని ప్రశ్న
సినిమాలలో భారీ డైలాగులు చెప్పి స్ఫూర్తి నింపే హీరోలు నిజ జీవితంలో కనీసం మనుషులుగానైనా వ్యవహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.చిరంజీవి రాజకీయంగానూ, నటుడిగానూ మంచిపేరు ఉన్న వారని పేర్కొన్న యామిని ఖైదీ నెంబర్ 150 సినిమా తీసిన చిరంజీవి ఆ సినిమాలో కార్పోరేట్ వ్యవస్థపై పోరాటం చేసి, రైతుల కోసం నిలబడ్డారని పేర్కొన్నారు. కానీ నిజ జీవితంలో అమరావతి ప్రాంత రైతుల ఆవేదన పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. ప్లకార్డులు పట్టుకుని వారు నిలుచుంటే కనీసం మాట మాత్రం అయినా వారి ఆవేదన పట్టించుకోలేదని సాధినేని యామిని తీవ్రంగా దుయ్యబట్టారు.
వారికి సినిమాలు ఆడటమే ముఖ్యం .. ఇంకేం పట్టవు
ప్రపంచంలో ప్రజలు చచ్చినా వారికి ఫర్వాలేదని, తాము మాత్రం బాగుంటే చాలు అని, ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే తమ సినిమాలు ఆడవని పిరికితనంగా ఉంటున్నారని ఆమె సినీ ప్రముఖులను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రాంతం వారి గురించి మాట్లాడితే ఎక్కడ తమ సినిమాలు ఆగిపోతాయనే భయం తప్ప మరొకటి లేదని వ్యాఖ్యానించారు. సినిమా ప్రముఖులు అమరావతి విషయంలోనే కాదు, ఎల్జీ పాలిమర్స్ ఘటనలో చనిపోయినా, తిత్లీ తుఫాన్ వచ్చినా, ఏ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నా, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా సరిగ్గా స్పందించరని సాధినేని యామిని ఘాటుగా విమర్శించారు.
Recommended Video
రియల్ హీరోలు కాకున్నా మనుషుల్లా అయిన ప్రవర్తించండన్న యామిని
సినిమా వాళ్ళంటేనే పక్కా కమర్షియల్ అని పేర్కొన్నారు. ఇక సినీ పరిశ్రమ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉందని పేర్కొన్న యామిని ఏపీ ప్రజల సొమ్మును అనుభవిస్తూ, హైదరాబాద్లో ఉంటూ ఏపీ సమస్యల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు అనిఆరోపించారు. రియల్ హీరోలు కానవసరం లేదని కనీసం మనుషుల్లా ఉంటే చాలని సినిమా హీరోలకు హితవుపలికారు సాధినేని యామిని.