రఘువీరా సాక్షిగా కాంగ్రెస్ శాడిజం: తారాజువ్వలకు పావురాల్ని కట్టి పేల్చారు, కేసు(వీడియో)
పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సాక్షిగా పలువురు కాంగ్రెస్ నేతలు తమ శాడిజాన్ని చాటుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రెండ్రోజుల క్రితం రఘువీరా రెడ్డి పర్యటించారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆయన సమక్షంలోనే తారాజువ్వలకు పావురాలను కట్టి ప్రయోగించారు. దీంతో ఆ తారాజువ్వలు ఆకాశంలోకి వెళ్లి పేలిపోయాయి. తారాజువ్వ పేలితే ఆ పావురాల పరిస్థితి ఏంటనేది అక్కడున్నవారెవరు పట్టించుకోకపోవడం విచారకరం.
అంతేగాక, తన కళ్లెదుటే పార్టీ కార్యకర్తలు పావురాలను తారాజువ్వల్లో కూరుతున్నా, రఘువీరా వారిని ఆపకపోవడం మరింత విచారకరం. మీడియా కంటికి చిక్కిన ఈ దృశ్యాలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకే తెరతీశాయి.
కాగా, ఈ ఘటనను సీరియస్గా పరిగణించిన పోలీసులు పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రబీ ఉల్లా బేగ్తో పాటు తారాజువ్వల తయారీదారుడు బాబుపై కేసు నమోదు చేశారు.