పవన్ చాలా నేర్వాలి, చిరు ఏం చేశారో అందరికీ తెల్సు: ఫ్యాన్స్ అడిగితే సాయి షాక్
చిత్తూరు: తమ అభిమాన హీరో, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని అభిమానులు కోరగా, వారికి మాజీ కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సాయి ప్రతాప్ గురువారం ఝలక్ ఇచ్చారు. పవన్ది ఉడుకు రక్తమని వ్యాఖ్యానించారు.
ఈరోజు చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం అఢవినాయన చెరువు సమీపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అదే సమయంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలని సమావేశంలో ఉన్న కొందరు పవర్ స్టార్ అభిమానులు అడిగారు. దీనిపై ఆయన స్పందించారు. పవన్ కళ్యాణ్ నేర్చుకోవాల్సింది చాలా ఉందిని చెప్పారు. ప్రత్యేక హోదా కావాలని నినదించడం సబబు కాదన్నారు. పవన్ సోదరుడు చిరంజీవి పార్టీ పెడితే ఏమైందో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు.
కాగా, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలుత తిరుపతిలో, ఆ తర్వాత కాకినాడలో, నవంబర్ 10వ తేదీన అనంతపురంలో సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సాయిప్రతాప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.