జగన్ పక్కన కూర్చోవద్దని ఆమె చెప్పినప్పుడు చాలా బాధపడ్డా: సాయి ప్రతాప్
హైదరాబాద్/విజయవాడ: ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి సాయిప్రతాప్ సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో తనకు ఎదురైన అనుభవాలను వివరించారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత తనను కాంగ్రెస్ పెద్దలు నమ్మేవారు కాదని, జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉండగానే ఓ సమావేశం జరిగిందని తెలిపారు. ఆ సమావేశంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోవద్దని, అలా చేస్తే సోనియాగాంధీకి కోపం వస్తుందని కాంగ్రెస్ నేత పనబాక లక్ష్మి తనతో చెప్పిందని తెలిపారు.
టిడిపిలో చేరిన సాయిప్రతాప్, సీఎం రమేష్ చక్రం: జగన్కు కడపలో చిక్కులే!
అప్పుడు తనకు చాలా బాధేసిందని చెప్పారు. తన మిత్రుడి కుమారుడు, కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా ఉన్న జగన్ పక్కన కూర్చోవద్దని చెప్పడాన్ని తాను తట్టుకోలేకపోయానని తెలిపారు. పనబాక వ్యాఖ్యల తర్వాత కావాలనే వెళ్లి జగన్ పక్కన కూర్చున్నానని సాయి ప్రతాప్ తెలిపారు. కొందరు నేతలు పనికట్టుకుని జగన్ దుర్మార్గుడంటూ అధిష్టానం వద్ద చెప్పేవారని సాయి ప్రతాప్ తెలిపారు. అలాంటి చెంచాల వల్లే కాంగ్రెస్ ఈ పరిస్థితికి చేరుకుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
వైయస్ అంటే గిట్టని నేతలంతా ఆయన చనిపోయిన తర్వాత తన గురించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో నెగిటివ్గా చెప్పారని తెలిపారు. వీడు ఎప్పటికైనా వైయస్ మనిషే అని సోనియాకు చెప్పారని అన్నారు. దీంతో జీవితాంతం వైయస్ కుటుంబంతో ఉండిపోవాలనుకున్నానని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తానే అనేకసార్లు వర్తమానం పంపినట్లు తెలిపారు.
జగన్మోహన్ రెడ్డికి తోడుగా తన అల్లుడు లోకేష్ను పంపేందుకు సిద్దపడ్డానని, అయితే అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. వైయస్తో ఆఖరి వరకు ఎలాంటి విభేదాలు లేకుండా స్నేహం చేసిన తనను జగన్ ఎందుకు దూరం పెట్టారో అర్థం కావడం లేదని చెప్పారు. ఈ బాధ తనకు ఇప్పటికీ గుండెల్లో ఉందని చెప్పారు.
జగన్, వైయస్ మధ్య ఘర్షణ వాతావరణం ఎప్పుడూ చూడలేదని అన్నారు. కడప ఎంపీ ఎన్నికల సమయంలో ఎవరు గెలుస్తారని ఓ విలేకరి ప్రశ్నించగా.. మంచివాళ్లే గెలుస్తారని చెప్పానని, ఆ విషయాన్ని కొందరు కాంగ్రెస్ నేతలు సోనియాకు ఫిర్యాదు చేశారని సాయిప్రతాప్ చెప్పారు. ఆ ఎన్నికల్లో జగన్ గెలవగానే తన మంత్రి పదవి కూడా తీసేశారని ఆయన తెలిపారు.
శత్రువుకు కూడా సాయం చేసే గుణం వైయస్ సొంతమని అన్నారు. ఆయన గొప్ప వ్యక్తని చెప్పారు. తన అల్లుడు లోకేష్ను ఎంపీగా చూడాలన్నదే తన కోరిక అని ఆయన తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు తనవంతు ప్రయత్నం చేశానని సాయి ప్రతాప్ వెల్లడించారు. కాగా, కాంగ్రెస్ పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సమయంలోనూ సాయి ప్రతాప్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం గమనార్హం.