'చంద్రబాబుకు అడిగే ధైర్యం లేదు, ఏపీ ప్రజలందరికీ తెలిసిపోయింది'
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బుధవారం నాడు శైలజానాథ్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రత్యేక హోదాతో ముడివడి ఉందన్నారు.
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బుధవారం నాడు శైలజానాథ్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రత్యేక హోదాతో ముడివడి ఉందన్నారు.
ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదని, ఆ విషయం రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైందన్నారు. చంద్రబాబుకు కావలసింది కమీషన్లు మాత్రమే అన్నారు. అందుకోసమే ఆయన హోదా కాకుండా ప్యాకేజీ ఇవ్వాలని అడుగుతున్నారన్నారు.
ప్యాకేజీ ఓ ఉంపుడుగత్తె, పడేస్తే ఉంటుంది, హోదా వల్ల ఇదీ లాభం: శివాజీ
ప్రత్యేక హోదా అన్నది రాష్ట్ర ప్రజల హక్కు అన్నారు. అది వారి ప్రాణం అని చెప్పారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అదొక్కటే మార్గం అన్నారు. ఇవేవీ పట్టించుకోకుండా కేవలం కమీషన్ల కోసం చంద్రబాబు కక్కుర్తి పడ్డారన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి నష్టం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వ వైఖరులను వ్యతిరేకిస్తూ గురువారం అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. గాంధీ, అంబేడ్కర్ విగ్రహాల వద్ద మౌన దీక్షలు చేపడతామన్నారు.
నోరు మూసుకోని కూర్చోవాలా?
తూర్పు గోదావరి జిల్లాలో పోలీసు ఆంక్షలు విధించడాన్ని వైసిపి నేత కన్నబాబు తప్పుబట్టారు. జిల్లాలో ఎక్కడికి అక్కడ నియంత్రణలు విధించడం సరికాదన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితో పోలీసులతో నిర్బంధిస్తున్నారన్నారు.
ఇలాంటి చర్యలతో చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. పాలకులు ఏం చేసినా అందరూ నోరు మూసుకొని కూర్చోవాలా అని అడిగారు. శాంతి భద్రతల పేరిట ప్రతి ఒక్కరిని అనుమానించడం దారుణం అన్నారు. నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు.