కిరణ్కు ఫస్ట్ షాక్: టిడిపిలోకి మాజీ మంత్రి శైలజానాథ్?
హైదరాబాద్: మాజీ మంత్రి శైలజానాథ్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లనున్నారనే ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి షాకిస్తూ ఆయన టిడిపిలో చేరడం దాదాపు ఖరారైపోయిందంటున్నారు. ఆయన టిడిపిలో చేరితే కిరణ్కు పెద్ద షాక్ అవుతుంది.
జై సమైక్యాంధ్ర పార్టీకి శైలజానాథ్ ఉపాధ్యక్షులు. అనంతపురం జిల్లాకు చెందిన శైలజానాథ్ అతి త్వరలోనే కిరణ్కు గుడ్బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని కథనాలు వస్తున్నాయి. శైలజానాథ్ చేరిక ప్రాథమికంగా ఖరారైందని లాంఛనంగా ప్రకటించడం ఒక్కటే మిగిలి ఉందంటున్నారు.
వైద్య చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లిన శైలజానాథ్ సోమవారం తిరిగి వచ్చారు. మంగళవారం అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ఒకవైపు శైలజానాథ్ను కిరణ్ తమ పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రకటించగా, శైలజానాథ్ మాత్రం తనకు ఆ పార్టీతో సంబంధం లేదన్నట్లుగానే మాట్లాడారు.
తన వెంట నడిచిన అన్ని వర్గాల ప్రజలనూ సంప్రదించి ఏ పార్టీలో చేరబోయేదీ గురువారం ప్రకటిస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి, తెలుగు ప్రజల అభివృద్ధికి పని చేసే పార్టీలోనే చేరతానని కూడా తెలిపారు. అయితే శైలజానాథ్, టిడిపి మధ్య ఇప్పటికే మధ్యవర్తుల స్థాయిలో చర్చలు జరిగాయంటున్నారు.
2009 ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గంలో శైలజానాథ్పై టిడిపి అభ్యర్థిగా శమంతకమణి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రస్తుతం శింగనమలలో టిడిపికి బలమైన అభ్యర్థి లేరు. అందువల్ల శైలజానాథ్ టిడిపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారని, ఆయనను చేర్చుకునేందుకు పార్టీ కూడా సిద్ధంగా ఉందంటున్నారు.