వ్యక్తిగత సమస్యలపై కూడా కలిశా: చంద్రబాబుతో భేటీపై శైలజానాథ్
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ నేత శైలజానాథ్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై శైలజానాథ్ స్పందించారు. నేను సచివాలయంకు వెళ్లి ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేమిటని వ్యాఖ్యానించారు. సచివాలయానికి వెళ్లి సీఎంను, సభాపతిని కలిసినట్లు తెలిపారు.
తన నియోజకవర్గంలోని సమస్యల విషయమై వారిని కలిశానని చెప్పారు. తాను మాజీ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా పలు సమస్యల పరిష్కారం కోసం కలిసినట్లు తెలిపారు. తన నియోజకవర్గంలోని సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యల పైన కూడా చంద్రబాబు, స్పీకర్ను కలిశానని వెల్లడించారు.
సిఎం చంద్రబాబుతో కాంగ్రెస్ నేత శైలజానాథ్ భేటీ:రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం
ఇందుకు గాను ఆయన తనకు రావాల్సిన పింఛను, వైద్య సదుపాయాలకు సంబంధించి పెట్టిన బిల్లుల తిరస్కరణకు సంబంధించిన ఎస్సెమ్మెస్ను మీడియాకు చూపించారు. తాను కాంగ్రెస్వాదినని, ఆ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. 2019లో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తానని చెప్పారు.
'నేను సెక్రటేరియట్కు వెళ్తే ఇక్కడకు ఎందుకు వచ్చారన్నట్టుగా అందరూ నన్నే చూస్తున్నారు.. నేను కాంగ్రెస్వాదిని.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. 2019లో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తాను' అని శైలజానాథ్ అన్నారు.