తేల్చి చెప్పిన శైలజానాథ్, కిరణ్ అసహనం: టిడిపిలోకి..
హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి శైలజానాథ్ షాకిచ్చారు. బుధవారం హైదరాబాదులో కిరణ్తో శైలజానాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాను జై సమైక్యాంధ్ర పార్టీలో ఉండలేనని నేరుగానే స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.
శైలజానాథ్ వైద్యం కోసం విదేశాల్లో ఉన్నప్పుడు కిరణ్ పార్టీని ప్రకటించారు. అప్పుడు వేదిక పైనుండి ఉపాధ్యక్ష పదవిని శైలజానాథ్కు కట్టబెడుతున్నట్లు ప్రకటించారు. మంగళవారం శైలజానాథ్ తిరిగి వచ్చారు. సన్నిహితులు, అనుచరులతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఏ పార్టీలోకి వెళ్లాలనే విషయమై చర్చించారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలో టిడిపి వైపే అడుగులు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం కిరణ్ను శైలజానాథ్ కలిశారు. ఆరోగ్యం గురించి వాకబు చేసిన కిరణ్.. పత్రికల్లో శైలజానాథ్ టిడిపిలోకి వెళ్తున్నారని వచ్చిన విషయాలను ప్రస్తావించారు. తనతో పాటు నడుస్తారని పార్టీలో ఉపాధ్యక్ష పదవి ఇచ్చానని ఈ పరిస్థితుల్లో పార్టీలోకి రానని చెప్పడం సహేతుకం కాదన్నారు. మీ అందర్నీ నమ్ముకొని తాను ముందుకు అడుగు వేశానని శైలజానాథ్తో కిరణ్ అసహనం వ్యక్తం చేశారట. ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయితే శైలజానాథ్ తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
శైలజానాథ్ సైకిలెక్కడం ప్రాథమికంగా ఖరారైందని, లాంఛనంగా ప్రకటించడమే మిగిలి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా తాను ఏ పార్టీలో చేరేదీ గురువారం ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. ఇక కిరణ్ను కలిసిన విషయమై శైలజానాథ్ను సంప్రదించగా మర్యాద పూర్వకంగా కలిశానని, ఆపరేషన్కు సాయం చేసినందుకు మాజీ సిఎంకు కృతజ్ఞతలు చెప్పానని పేర్కొన్నారు.