చంద్రబాబుకు సజ్జల సవాల్: మా సపోర్టర్స్ వీరే.. మరీ మీ మద్దతుదారులేరీ..
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసాయి. నాలుగు విడతల్లో పంచాయతీ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. పంచాయతీ పోల్లో మెజార్టీ స్థానాలను వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. పంచాయతీల విజయంపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య వార్ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగానే స్పందించారు. చంద్రబాబు నాయుడు అబద్దాలు వల్లెవేయడం ఇంకా ఆపలేదని చెప్పారు.
పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఇంకా అబద్ధాలు చెప్పడం ఎందుకని చంద్రబాబును ప్రశ్నించారు. తప్పుడు ప్రకటనలు చేయడం ఏంటని నిలదీశారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు ఎక్కడెక్కడ గెలిచారో వారి ఫొటోలతో సహా జాబితాలు వెబ్ సైట్లో ysrcppolls.in విడుదల చేశామని తెలిపారు.
టీడీపీ మద్దతుదారులు ఎక్కడెక్కడ గెలిచారో ఫొటోలతో సహా జాబితా విడుదల చేయగలరా అని సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. అంతకుముందు ఆయన ట్వీట్ కూడా చేశారు. రెండేళ్ల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పునే ప్రజలు ఇప్పుడు ఇచ్చారని పేర్కొన్నారు. నిజాయతీ, నిబద్ధతతో హామీలను నెరవేరుస్తున్నామని వివరించారు. మరో 30 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలని ఈ తీర్పు ద్వారా ప్రజలు వెల్లడించారని సజ్జల వివరించారు.