ప్రజలు ఛీత్కరించినా.. ఎవరిని మభ్యపెడతావ్ చంద్రబాబు, హుందాగా ఓటమి ఒప్పుకో : సజ్జల సలహా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికి మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా మూడు విడతల్లో వైసిపి ఆధిక్యాన్ని కనబరిచిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మూడు విడతల్లోనూ టిడిపి సత్తా చాటిందని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వై ఎస్ ఆర్ సి పి వివరాలను వెబ్ సైట్ లో ఉంచామని , దమ్ము ధైర్యం ఉంటే వాటిలో ఏ ఒక్కటైనా తప్పుగా ఉందని నిరూపించగలరా అంటూ వైసిపి నాయకులు చంద్రబాబుకు సవాల్ విసురుతున్నారు.
ఎస్ఈసీపై టీడీపీ ఆరోపణలపై సజ్జల ఫైర్.. చంద్రబాబుకు పక్కవాళ్ళ మీద పడి ఏడవటం అలవాటే అంటూ
తామిచ్చిన జాబితా దమ్ము, ధైర్యం ఉంటే తప్పని నిరూపించమని సజ్జల సవాల్
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు వివరాలను వెబ్ సైట్ లో ఉంచామని పేర్కొన్నారు. చంద్రబాబు టిడిపి మద్దతుదారులు గెలిచిన వారి వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తామిచ్చిన జాబితా దమ్ము, ధైర్యం ఉంటే తప్పని నిరూపించమని ప్రశ్నించారు . చంద్రబాబు ఓటమిని హుందాగా ఒప్పుకుంటే బాగుంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి సలహా ఇచ్చారు.
టీడీపీ ఎక్కడా కనీసం పోటీ పడలేకపోయింది
ఏజెన్సీలో మొత్తం పంచాయతిలను టీడీపీ మద్దతుదారులే దక్కించుకున్నారని చంద్రబాబు చెప్పారని, ఆయన వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు.
టిడిపి మద్దతుదారులు ఏజెన్సీ మొత్తాన్ని గెలిచారని చెప్పడం దారుణం అన్నారు. ప్రజలు ఒకపక్కన ఛీత్కరిస్తున్నా, ఇంకా ఎవరిని మభ్యపెడుతావ్ చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులకు వచ్చిన మెజారిటీ తో పోలిస్తే, టిడిపి ఎక్కడా కనీస స్థాయిలో కూడా పోటీపడలేక పోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తిమ్మిని బమ్మిని చేసి అబద్ధాలు చెబితే ప్రజలు నమ్ముతారనే భ్రమలో చంద్రబాబు
వైసీపీ మద్దతుదారుల వివరాలు వెల్లడించడంలో తాము పారదర్శకంగా వ్యవహరించామని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి, టిడిపి నుండి గెలిచిన వారి వివరాలు ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తిమ్మిని బమ్మిని చేసి అబద్ధాలు చెబితే ప్రజలు నమ్ముతారనే భ్రమ నుంచి చంద్రబాబు ఇంకా బయటపడలేదని ఎద్దేవా చేసిన సజ్జల రామకృష్ణా రెడ్డి , ఓటమి బాధలో ఉన్న చంద్రబాబు ఎవర్ని ఏమంటున్నాడో కూడా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
కుప్పం ప్రజలు డబ్బు తీసుకుని ఓట్లేశారని అవమానించిన బాబు అంటూ ఫైర్
దశాబ్దాలుగా చంద్రబాబును గెలిపించిన కుప్పం ప్రజలే డబ్బులు తీసుకొని, డబ్బుల మాయలో ఓటేశారని అవమానించిన చంద్రబాబును ప్రజలు ఎందుకు క్షమించాలో చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు సంస్కారం లేదని మండిపడ్డారు. పిల్లనిచ్చిన మామను, ఓట్లేసిన ప్రజలను కూడా వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకి న్యాయమేనా అని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి.