స్వీయ నిర్బంధం వీడిన బాబు.. విజయవాడ రావడంపై సజ్జల రామకృష్ణారెడ్డి విసుర్లు..
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. ఎట్టకేలకు స్వీయ నిర్బంధం వీడిన బాబు.. అంటూ విరుచుకుపడ్డారు. కరోనా వైరస్ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ఉంటోన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత ఏపీలో కాకుండా.. భాగ్యనగరంలో ఉండటం ఏంటీ అనే విమర్శలు వచ్చాయి. కానీ బాబు మాత్రం హైదరాబాద్ వీడలేదు. కానీ ఇవాళ విజయవాడ వచ్చి తమ పార్టీ నేతలను పరామర్శించడంతో.. సజ్జల సెటైర్లు వేశారు.
పార్టీ నేతలకు పరామర్శ
హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన చంద్రబాబు బుధవారం సాయంత్రం పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను పరామర్శించారు. చంద్రబాబు పద్ధతే వేరు అని విమర్శలు చేశారు. కరోనా వైరస్ భయంతో నెలాళ్లు హైదరాబాద్లో స్వీయ నిర్బంధం నుంచి బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. కార్మికుల సొమ్ము మింగేసి బెయిల్పై బయటికి వచ్చిన అచ్చెన్నాయుడిని, హత్యకేసులో అరెస్టయిన రవీంద్రను పరామర్శించారు అని ధ్వజమెత్తారు.
గ్యాస్ లీక్ బాధితులు
విశాఖ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించడానికి మాత్రం చంద్రబాబుకు సమయం లేదు అని విమర్శించారు. పైగా వెళ్లనివకుండా విమానాలను అడ్డుకున్నారని, ఆంక్షలు విధించారని కామెంట్లు మాత్రం చేస్తారని అన్నారు. చంద్రబాబుకు ప్రజల పట్ల బాధ్యత ఉందా అని ప్రశ్నించారు.
అచ్చెన్నకు పరామర్శ
మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు ఆయన ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చారు. అతని ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో అచ్చెన్నాయుడు చేరిన సంగతి తెలిసిందే. కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఆయన ఇంటికి చంద్రబాబు నాయుడు వచ్చారు. ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడికి హైకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Recommended Video
కొల్లుకు కుశల ప్రశ్నలు
మాజీమంత్రి కొల్లు రవీంద్రని కూడా చంద్రబాబు పరామర్శించారు. వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. చింత చిన్నాకు రవీంద్ర అండగా ఉన్నారని పోలీసులు అభియోగాలు మోపారు. ఆయనే పోలీసులకు లొంగిపోగా.. జైలుకు తరలించారు. పలుమార్లు బెయిల్ కోసం ఆప్లై చేయగా.. చివరికీ మంజూరు చేశారు.