ప్రతిపక్ష పాత్ర పోషించడంలో చంద్రబాబు ఫెయిల్, అందుకే డీజీపీకి లేఖలు: సజ్జల ఫైర్..
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు. ఆయన డీజీపీకి ఎందుకు లేఖలు రాస్తున్నారని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా లేఖలు రాయడం ఏంటీ అని ఫైరయ్యారు. ఏ చిన్న ఘటన జరిగిన భూతద్దంలో చూపిస్తూ లేఖ రాయడం మంచి పద్ధతి కాదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే రెస్పాండ్ అవుతున్నామని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని సజ్జల వివరించారు. ఓ ఇన్స్పెక్టర్ను అరెస్టు కూడా చేశారని గుర్తు చేశారు. చంద్రబాబుకు స్వార్థం తప్ప..జనం కష్టాలు తెలీవని మండిపడ్డారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కూడా టీడీపీ విఫలమైందని ధ్వజమెత్తారు. లేఖలు రాసే ముందు చంద్రబాబు లెక్కలు సరిచూసుకోవడం లేదన్నారు.
చంద్రబాబు నేరాల విషయంలోనూ అబద్ధాలు చెబుతున్నారని సజ్జల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏం జరిగినా దానికి వైసీపీతో ముడి పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం తప్ప మరో ఆలోచన లేదన్నారు. ఆరునెలలు హైదరాబాద్లో దాక్కున్న చంద్రబాబు ఇప్పుడు మేల్కొన్నారని తెలిపారు. కోవిడ్పై తమకు సమాచారం ఇవ్వాలని వెబ్సైట్ ఓపెన్ చేశారని.. ఆయన తీరు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు.
గత ఆరు నెలలుగా ప్రభుత్వ యంత్రాంగం కరోనా వైరస్ నియంత్రణ కోసం శాయశక్తులా కృషి చేస్తుందని తెలిపారు. దేశంలోనే ఏపీ చేపట్టిన నియంత్రణ చర్యలు బాగున్నాయని తెలిపారు. ఏ ఘటన అయినా సరే పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.