సెల్ఫ్ డబ్బా.. అసలు 'పప్పు'కు అది తెలుసా... పాయింట్ జీరో స్థాయిలో అయినా...: సజ్జల
అమరావతి ఉద్యమంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాగా డబ్బున్న ప్రొడ్యూసర్.. తానే ఓ చెత్త సినిమా తీసి... తానే ఆడించుకుని... రికార్డులు బద్దలంటూ సెలబ్రేషన్స్ చేసుకున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజా ఉద్యమాలు ఎప్పుడూ ఉత్తేజభరితంగా సాగుతాయని... కానీ 'ఉద్యమం' అన్న మాటకే అవమానం కలిగించేలా అమరావతి ఉద్యమం సాగుతోందని విమర్శించారు. అయితే ఇందులో కొంతమంది అమాయకులు కూడా ఉన్నారని,వారిని కించపరిచే ఉద్దేశం తమకు లేదని అన్నారు.
అసలు పప్పుకు అది తెలుసా : సజ్జల
ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని లోకేష్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు సజ్జల.' రాజధాని ఉద్యమం అంటారు... మరి టీడీపీ నాయకులు ఎందుకు రావట్లేదు... మీ కొడుకు లోకేష్ను మాత్రమే అక్కడికి ఎందుకు పంపారు... అసలు పప్పుకు పంట ఎలా ఉంటుందో తెలుసా... ఐదు కోట్ల ఆంధ్రుల సమస్య అంటారు... చారిత్రక ఆవశ్యకత అని ఒక ఊత పదం వాడుతున్నారు. అసలు అమరావతి ఉద్యమం పాయింట్ జీరో స్థాయిలో అయినా ఉందా... నువ్వే దాన్ని ఎన్నడో వదిలేశావు... వలస పక్షుల్లా అప్పుడప్పుడు అక్కడికి వచ్చిపోతున్నారు.. ఎందుకని అక్కడే ఉండి పోరాడట్లేదు...' అని చంద్రబాబుపై సజ్జల ఫైర్ అయ్యారు.
సీబీఐ విచారణ కోరవచ్చు కదా...
అమరావతిలో టీడీపీ ప్రభుత్వం చేసింది పచ్చి మోసమన్న సజ్జల... ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో న్యాయం జరగబోతుందన్నారు. మిమ్మల్ని మోసపోయామని గ్రహించాక... మీ సామాజికవర్గంతో సహా అక్కడివాళ్లంతా మిమ్మల్ని ఛీ కొడుతున్నారని చంద్రబాబును విమర్శించారు. విధ్వంసం మాత్రమే తెలిసిన చంద్రబాబు... ఏనాడైనా ఉద్యమం నడిపారా అని ప్రశ్నించారు. సుమారు 4వేల ఎకరాలు చంద్రబాబు,ఆయన బినామీలు స్వాహా చేసినట్లు విచారణలో తేలిందన్నానరు. డీజీపీకి,సీఎస్కి లేఖలు రాసే బదులు దీనిపై సీబీఐ విచారణ కోరవచ్చు కదా అని ప్రశ్నించారు. కడిగిన ముత్యంలా బయటకొస్తే ఎవరు అభ్యంతరం చెప్పరు కదా అని అభిప్రాయపడ్డారు.
బినామీల వెన్నులో వణుకు...
అమరావతి ఉద్యమంలో ఉన్నది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని... అక్కడి నిజమైన రైతులు మీరు ఉద్యమం ఎప్పుడు వదిలేస్తారా అని ఎదురుచూస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్నారు. 'అమరావతిలోనే రాజధాని ఉండాలని వచ్చే ఎన్నికల వరకూ పోరాడు... మీరెన్ని ఆటంకాలు సృష్టించినా అక్కడ జరిగే అభివృద్ది జరుగుతుంది. త్వరలోనే కొన్ని పనులకు టెండర్లు కూడా పిలుస్తున్నాం. రైతులకు అన్యాయం జరగట్లేదు. కేవలం మీ బినామీలకే వెన్నులో వణుకు పుడుతోంది.' అని సజ్జల పేర్కొన్నారు.
అభివృద్ది జరగడం ఖాయం...
'అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్పై సీబీఐ విచారణకు రెడీ అనండి... త్వరలోనే ఏది ఏంటో తేలిపోతుంది. అమరావతి ఉద్యమంలో 90 మంది వరకూ అమరులయ్యారని చెప్తున్నారు. మొన్ననే ఓ మృతుడి కూతురు లోకేష్ ట్వీట్ విషయంలో తిట్టి పోసింది. ఎలాగూ చరిత్ర హీనులయ్యారు. ఇంకా దిగజారాడానికి ఏమీ లేదు. అమరావతి ప్రాంతం తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి ఉద్యమాలు,న్యాయపరమైన సమస్యలు సృష్టించడం వల్ల కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ అభివృద్ది జరగడం ఖాయం.' అని చెప్పుకొచ్చారు.