తెలంగాణకు వివేకా కేసు బదిలీ మంచిదే-ఇవాళ్టి వరకూ అమరావతే రాజధాని- సజ్జల కామెంట్స్
ఏపీకి సంబంధించిన రెండు కీలక అంశాలపై 24 గంటల వ్యవధిలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఒకటి అమరావతి రాజధానికి సంబంధించింది కాగా.. మరొకటి మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన అంశం. ఈ రెండు అంశాల్లోనూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు తమకు అనుకూలంగానే ఉన్నాయని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ వ్యాఖ్యానించారు.
అమరావతి రాజధాని విషయంలో మా స్టాండ్ కు తగ్గట్టే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ తెలిపారు. ప్రభుత్వం రాజధాని అంశంలో ఒక నిర్ణయం తీసుకుందని, దీనిపై సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు చేసిందన్నారు. రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని సజ్జల తెలిపారు. రాజధాని అంశం ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఒప్పందం కాదని, ప్రభుత్వంతో రైతులు చేసుకున్న ఒప్పందమని సజ్జల గుర్తుచేశారు. మూడు రాజధానులతో వికేంద్రీకరణ చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఇవాళ్టి వరకూ అమరావతే రాజధాని అని, అదే సుప్రీంకోర్టుకు చెప్పామన్నారు.
మరోవైపు ఇవాళ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణను హైదరాబాద్ కు బదిలీ చేస్తూ ఇచ్చిన ఆదేశాలపైనా సజ్జల స్పందించారు. వైఎస్ వివేకానందరెడ్డి వైసీపీ నాయకుడని, జగన్ కు చిన్నాన్న అని సజ్జల గుర్తుచేశారు. ఈ కేసులో రాజకీయాలు ఉండవన్నారు. టీడీపీ వివేకా కుటుంబ సభ్యులతో కుట్ర చేస్తోందని సజ్జల ఆరోపించారు. అంతిమంగా నిజానిజాలు తెలియాలన్నారు. అందుకే తెలంగాణలో విచారణ జరిగితే ఇంకా మంచిదని సజ్జల తెలిపారు. తమకు ఎలాంటి భయాలు లేవని, దాపరికాలూ లేవని ఆయన పేర్కొన్నారు.వివేకా హత్యలో నిజాలు తెలియాలని, దోషులకు కఠినశిక్ష పడాలని సజ్జల ఆకాంక్షించారు.