రాజమండ్రి తొక్కిసలాట: ఫొటోతో బోయపాటి డైరెక్షన్లో చంద్రబాబు
హైదరాబాద్: సోషల్ మీడియాలో గురువారంనాటి నుంచి ఓ ఫొటోతో కూడిన వ్యాఖ్యలు హల్చల్ చేస్తున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ లఘు చిత్రం కోసం గోదావరి పుష్కరాల సందర్భంగా స్నానం చేస్తూ లఘు చిత్రం తీస్తున్నట్లు ఉన్న ఫొటో అది. చంద్రబాబు ప్రత్యర్థులు ఆ ఫొటోను షేర్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.
బోయపాటి శ్రీను దర్సకత్వంలో చంద్రబాబు సినిమా చేయడానికి సిద్ధపడడం వల్లనే రాజమండ్రి పుష్కర ఘాట్లో తొక్కిసలాట జరిగి 27 మంది మరణించారని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి గురువారంనాడు ఆరోపించారు. అందుకు అనుగుణంగానే శుక్రవారం సాక్షి దినపత్రిక ఓ ఫొటోతో వార్తాకథనాన్ని ప్రచురించింది. చంద్రబాబు చర్య వల్లనే రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద ప్రమాదం జరిగిందని చెప్పడానికి ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది.
గోదావరి పుష్కరాలను మహా కుంభమేళాకు దీటుగా నిర్వహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీ ప్రచారం పొందాలని చంద్రబాబు ముందే నిర్ణయించుకున్నారని, ఈ మేరకు పుష్కర స్నానాలప్రారంభం, సిఎం కుటుంబ సభ్యులు పుణ్య స్నానాలు, లక్షలాది భక్తుల హాజరు, ఘాట్లలో హడావిడి అన్ని కలిపి ఓ డాక్యుమెంటరీ తీసి విదేశీ ప్రతినిధులకు చూపించి ఖ్యాతి పొందాలని చంద్రబాబు భావించారని సాక్షి దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది.
దాని కోసం ఓ ప్రభుత్వ సలహాదారును రంగంలోకి దింపారని, డాక్యుమెంటరీ నిర్మాణం కోసం చంద్రబాబు కొన్ని జాతీయ చానెళ్లను సంప్రదించారని, చివరకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన జియోగ్రఫీ చానెల్తో ఒప్పందం కుదుర్చుకుని అందుకు ఏర్పాటు చేశారని ఆ వార్తాకథనం తెలియజేస్తోంది.
సాక్షి దినపత్రిక కథనం ప్రకారం - జాతీయ చానెల్ ప్రతినిధులకు అన్ని ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు తన కొంత మంది సినీ ప్రముఖులను కూడా రంగంలోకి దింపారు. గోదావరి హారతి కార్యక్రమంతో పాటు లేజర్ షోలు, ఇతర ఆర్భాటాలను చంద్రబాబు చేయించారు. వాటి చిత్రీకరణ బాధ్యతను బోయపాటి శ్రీనుకు అప్పగించారు. డాక్యుమెంటరీ ముహూర్తపు షాట్గా పుష్కరాల ముందు రోజైన సోమవారం రాత్రి పుష్కర ఘాట్లో ముఖ్యమంత్రి నిర్వహించిన గోదావరి నిత్యహారతిని వాడుకున్నారు. ఈ షాట్ అంతా బోయపాటి డరెక్షన్లో తీశారు.
ఇంకా సాక్షి మీడియా కథనం ఇలా సాగింది - రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా విఐపిలు, వివిఐపిలు స్నానం చేయడానికి ప్రభుత్వం సరస్వతీ ఆలయం వద్ద ప్రత్యేక ఘాట్ను ఏర్పాటు చేసింది. షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం ఆ ఘాట్లోనే పుష్కరాలను ప్రారంభించాల్సి ఉంది. దీికోసం భద్రతాధికారులు సోమవారం రాత్రి అడ్వాన్డ్స్ సెక్యూరిటీ లైజన్ (ఎఎస్ఎల్) పేరుతో భద్రతను పర్యవేక్షించే రిహార్సల్స్ కూడా నిర్వహించారు.
అయితే, మంగళవారం తెల్లవారు జామున ఎఎస్ఎల్ పూర్తయిన తర్వాత క్షేత్రస్థాయి సిబ్బందికి ముఖ్యమంత్రి పుష్కర ఘాట్లో పుష్కరాలను ప్రారంభిస్తారని సమాచారం అందింది. ముక్యమంత్రి పుష్కరాలను ప్రారంభిస్తున్న ఘట్టాన్ని తాము డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తామని, దీని కోసం చుట్టూ భారీ జనం ఉంటే ఎఫెక్ట్ బాగుంటుందని సినీ, టీవీ చానెల్ ప్రతినిధులు చెప్పడంతో ఆ మార్పు జరిగినట్లు తెలిసిందంటూ సాక్షి దినపత్రిక రాసింది.
సాక్షి దినపత్రిక ఇంకా ఇలా కొనసాగించింది - ఇతర ఘాట్లలో ఉన్న భక్తులను కూడా ఇక్కడికి మళ్లిస్తే షాట్స్ మరింత ఎఫెక్ట్గా వస్తాయని చెప్పడంతో చంద్రబాబు ఆదేశాల మేరకు భక్తులను పుష్కరఘాట్కు మళ్లించారు. దాంతో పెద్ద యెత్తున భక్తులు అక్కడికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పుణ్యస్నానాలు, పితృదేవతలకు పిండ ప్రదానం, క్రతువులు, వాటి చిత్రీకరణ వంటివాటి కోసం దాదాపు రెండున్నర గంటల పట్టింది. అంతసేపు భక్తులను గేటు బయటే నిలిపేశారు చివరకు గేట్లు తెరిచిన తర్వాత భక్తులు ఒక్కసారిగా వచ్చి పడడంతో తొక్కిసలాట జరిగి 27 మంది మరణించారు.
ఘాట్ బయట, లోపల జనసమూహం ఎక్కవ సమయం ఉండిపోవడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక దానికి బలం చేకూరుస్తుందంటూ సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది.