వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్: హైకోర్టులో వాదనలకు సల్మాన్ ఖుర్షీద్..! టీడీపీ కొత్త ఎత్తుగడ...!
మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్. సుదీర్ఘంగా సిట్ విచారిస్తున్న ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్టులో కేసు దాఖలు చేసారు. ఈ కేసును హైకోర్టు విచారణకు స్వీకరించటంతో..ఇప్పుడు టీడీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని న్యాయవాదులను కాకుండా.. జాతీయ స్థాయిలో పేరున్న న్యాయవాదులను తమ తరపు వాదనలు వినిపించేందుకు జాతీయ స్థాయిలో పేరున్న లాయర్ ను తీసుకురావాలని నిర్ణయించారు.
అందులో భాగంగా ఈ కేసు వాదనల కోసం కాంగ్రెస్ నేత..సీనియర్ లాయర్ అయిన సల్మాన్ ఖుర్షీద్ ను ఎంపిక చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఆయనతో చర్చలు జరిగాయని..ఆయన బీటెక్ రవి దాఖలు చేసిన పిటీషన్ కు మద్దతుగా హైకోర్టులో వాదనలు వినిపించనున్నారని సమాచారం. దీని ద్వారా తమ పార్టీకి చెందిన నేతలకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని చెబుతూనే..తొలి నుండి తాము ముఖ్యమంత్రి కుటుంబం పైన చేస్తున్న రాజకీయ ఆరోపణలకు బలంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దిశ చట్టం.. కొత్త చట్టాలతో ఉపయోగం ఏంటి: వివేకా హత్య కేసులోనూ 21రోజల్లోనే చేయచ్చుగా: పవన్
వివేకా కేసులో కొత్త ఎంట్రీ..
2019 ఎన్నికల సమయంలో హత్యకు గురైన వైయస్ వివేకా హత్య కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది. హత్య జరిగిన సమయం నుండి దీని పైన రాజకీయంగా అనేక విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. సొంత బాబాయ్ హత్య కేసు విషయంలో సీఎం ఏం తేల్చలేకపోయారంటూ టీడీపీ..జనసేన నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ హత్య కేసుపైన విచారిస్తున్న సిట్ టీడీపీ నేతలు బీటెక్ రవితో పాటుగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని సైతం విచారించింది. అయితే, ఆ ఇద్దరు నేతలు హత్యతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసారు. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి దీని పైన హైకోర్టులో పిల్ దాఖలు చేసారు. వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే, ఈ కేసును సీబీఐకు అప్పగించాలనే డిమాండ్ ను మరింత బలంగా హైకోర్టు ముందు వాదించేందుకు జాతీయ స్థాయిలో పేరున్న ప్రముఖ న్యాయవాదిని సల్మాన్ ఖుర్షీద్ ను రంగంలోకి దించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సీబీఐకి అప్పగించాలంటూ..
మాజీ మంత్రి వివేకా హత్య కేసు తరువాత టీడీపీ అనేక ఆరోపణలు చేసింది. ఇది ఇంటి దొంగల పని అంటూ ఆరోపించింది. దీని పైన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సిట్ ఏర్పాటు చేసారు. దీని పైన సీబీఐ విచారణ చేయించాలని అప్పట్లో వైసీపీ డిమాండ్ చేసింది. ఇక, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయి ఆరు నెలలు పూర్తయినా ఇప్పటికీ సిట్ విచారణ కొనసాగుతోంది. కడప ఎంపీ అవినాశ్ తండ్రి ని సైతం సిట్ విచారించింది. అయితే, ఈ కేసులో ఎవరున్నా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక, ఇదే అంశం పైన టీడీపీ నేతలను విచారించటంతో..ఆ పార్టీ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. కడప జిల్లాకు చెందిన టీడీపీ నేతలు బీటెక్ రవి..మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని సిట్ విచారించింది. ఇక, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో బీటెక్ రవి పిటీషన్ దాఖలు చేయటం ..ఇప్పుడు సల్మాన్ ఖుర్షీద్ ను రంగంలోకి దించటం ద్వారా ఎలాగైనా ఈ కేసును సీబీఐకి ఇచ్చేలా న్యాయ పోరాటం చేయాలని టీడీపీ భావిస్తోంది.
సీఎం ఎందుకు అప్పగించటం లేదంటూ..
తాజాగా.. టీడీపీ..జనసేన నేతలు సైతం ఈ కేసు మీద స్పందించారు. గతంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన వైసీపీ..అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం హైకోర్టుకు చేరటం... సల్మాన్ ఖుర్షీద్ ను తమ న్యాయవాదిగా తీసుకురావాలని నిర్ణయించటం ద్వారా టీడీపీ రాజకీయంగా పైచేయి సాధించాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. సిట్ విచారణ సాగుతుండగానే..దీని పైన హైకోర్టులో విచారణ..అక్కడే జరిగే వాదనలు ఇప్పుడు ఈ కేసులో ఆసక్తి కరంగా మారనున్నాయి.