జనాలకు పవర్ పంచ్.. రేవంత్, సమైక్య హామీలతో ఇరుకున బాబు: మూడేళ్లేనా!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇరుకున పడ్డారు! తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఓ సభలో ఆయన హామీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన పైన విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
నిన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి వ్యవహారం టీడీపీని, చంద్రబాబును ఇరుకున పెట్టింది. ఇప్పుడు స్వయంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఇబ్బందికర పరిణామాలను తెచ్చిపెట్టాయి.
తాను సమైక్య రాష్ట్రంలో ఒకటి రెండు కాదు చాలా హామీలు ఇచ్చానని, విభజన తర్వాత పరిస్థితులు వేరుగా ఉన్నాయని, హామీలు కష్టమైనప్పటికీ మీరు నన్ను నమ్మి ఓటు వేసిన విషయాన్ని గుర్తుంచుకుంటానని ఆయన చెప్పారు.
దీనిపై కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఓ వైపు మంగళగిరిలో జగన్ సమర దీక్ష చేస్తుండగానే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో సమర దీక్ష ముగింపు సమయంలో జగన్ మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యాక.. మహిళలు, రైతులు, ప్రజలతో అవసరం తీరిపోయాక ఇప్పుడు హామీల పైన యూ టర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రెండేళ్లున్నా, మూడేళ్లున్నా ఆ తర్వాత అధికారంలోకి తామే వస్తామని చెప్పారు.
హామీల పైన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నారని, నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా మేనిఫెస్టోను ఎందుకు విడుదల చేశారో చెప్పాలని అభిప్రాయపడ్డారు. ఏపీ విడిపోయిన విషయం తెలియకుండానే హామీలు గుప్పించారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య కూడా మండిపడ్డారు. చంద్రబాబు వంచ నైజం రోజుకొకటి బయటపడుతోందన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసే నాటికే రాష్ట్రం రెండుగా విడిపోయిన విషయం తెలియదా అని ప్రశ్నించారు.
అయితే, బాబు చెప్పిన దాంట్లో తప్పులేదని, ఆయన చెప్పిన దానిని అర్థం చేసుకోవాలని ఇంకొందరు అంటున్నారు. సమైక్య రాష్ట్రంలో హామీలు ఇచ్చానని, విభజన అనంతరం కష్టమైనప్పటికీ.. మీరు నన్ను నమ్మి ఓటు వేసిన విషయం గుర్తుకుంచుకుంటానని చెప్పారని, తద్వారా ఆయన హామీలు నెరవేర్చుతానని చెప్పారని అంటున్నారు.