అసలు ఏం జరిగింది? ఏం జరగబోతోంది? ఎపికి ఫుల్ టైమ్ డిజిపి నియామకం వెనుక ఇంత తతంగం నడిచిందా?
రాష్ట్ర పూర్తిస్థాయి డీజీపీగా నండూరి సాంబశివరావును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. దీంతో ఎపి పుల్ టైమ్ డిజిపి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పూర్తిస్థాయి డీజీపీగా నండూరి సాంబశివరావును నియమిస్తూ ఎపి ప్రభుత్వం తీసుకున్ననిర్ణయం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ నియామకం వెనుక చాలా ఆసక్తికర పరిణామాలే చోటుచేసుకున్నాయి. పలు మలుపులు తిరిగిన ఎపి డిజిపి నియామకం వ్యవహారంలో చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు తాను అనుకున్నదే చేశారు. 16 నెలలుగా ఇన్ ఛార్జ్ డిజిపిగా కొనసాగుతున్న నండూరి సాంబశివరావు ఎపి ప్రభుత్వం ఉత్తర్వులతో రాష్ట్ర పూర్తి స్థాయి డిజిపిగా నియమితులయ్యారు. ఇప్పటిదాకా పోలీస్ కో ఆర్డినేషన్ విభాగం డీజీపీ పోస్టులో కొనసాగుతున్న సాంబశివరావును డీజీపీ (పోలీసు దళాల అధిపతి)గా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
ఇన్ ఛార్జ్ నుంచి ఫుల్ టైమ్ డిజిపి దాకా...
2016 జులై 23 వ తేదీన ఎపి ప్రభుత్వం నండూరి సాంబశివరావును ఇన్ఛార్జీ డీజీపీగా నియమించింది. అప్పటినుంచి ఆయన ఆ హోదాలోనే పూర్తిస్థాయి అదనపు డిజిపిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే డిసెంబరు నెలాఖరుకు సాంబశివరావు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో నూతన డిజిపి ఎవరనే విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రాష్ట్రంలో నెలకొని ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాంబశివరావునే పూర్తిస్థాయి డీజీపీగా నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఆ క్రమంలోనే నూతన పూర్తి స్థాయి డిజిపి నియామకం కోసం ఏడుగురు సీనియర్ పోలీస్ అధికారుల పేర్లతో కేంద్రానికి జాబితా పంపించడం జరిగింది. అయితే వారు ఆ జాబితాలో మార్పులు సూచించి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాను తిరస్కరించారు. అయితే సాంబశివరావు నే పూర్తి స్థాయి డిజిపిగా నియమించాలని పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి జాబితాను పంపింది. అయితే కేంద్రం నిబంధనలకు అనుగుణంగా జాబితా పంపాలని సూచిస్తూ మరోసారి జాబితాను తిప్పి పంపడంతో డిజిపి నియామకంపై ప్రతిష్టంభన నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జాబితాపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ నెల 22న జరగాల్సిన డిజిపి ఎంపిక కమిటీ సమావేశం కూడా వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఇన్ఛార్జీ డీజీపీ నండూరి సాంబశివరావునే ఎపి ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్రం ఎందుకు తిరస్కరించింది?
ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి డిజిపి నియామకం కోసం ఎపి ప్రభుత్వం యుపిఎస్ కి అర్హులైన సీనియర్ పోలీస్ అధికారుల పేర్లతో కూడిన ప్రతిపాదనల జాబితా పంపాల్సి ఉంది. అియతే నండూరి సాంబశివరావునే పూర్తి స్థాయి డిజిపి పదవిలో నియమించాలని భావించిన ఎపి ప్రభుత్వం ఆయన పేరును కూడా జాబితాలో చేర్చి కేంద్రానికి పంపింది. అయితే యుపిఎస్సీ నిబంధనల ప్రకారం ఏడాదిలోపు రిటైరయ్యే అధికారుల పేర్లను ఈ జాబితాలో చేర్చరాదు. దీంతో అలాంటి అధికారుల పేర్లను జాబితా నుంచి తొలగించి సీనియర్ల జాబితా పంపాలని సూచిస్తూ కేంద్రం ఆ జాబితా ను తిప్పిపంపింది. అయితే డిజిపి పదవి రాష్ట్ర పరిపాలనకు సంబంధించి కీలకం కావడంతో సాంబశివరావుకే ఆ పదవి ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి జాబితాను కేంద్రానికి పంపడంతో పాటు రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితులను కేంద్రానికి వివరించి తమ నిర్ణయానికి ఆమోదముద్ర వేయాలని విన్నవించుకోవడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆశలపై నీళ్లు పోస్తూ కేంద్రం మరోసారి మొదట చెప్పిన కారణాన్నే మరోసారి ఎత్తి చూపుతూ రెండో సారి జాబితాను తిప్పిపంపడం జరిగింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విశేష అధికారాన్ని వినియోగించుకొని నండూరి సాంబశివరావుని ఎపి పూర్తి స్థాయి డిజిపిగా నియమిస్తూ ఏకంగా ఉత్తర్వులే జారీ చేసింది.
ఏం జరుగుతుంది?
అయితే ఈ ఏడాది డిసెంబర్ 31నే నండూరి సాంబశివరావు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ తర్వాత పరిస్థితి ఏమిటనే సందేహం తలెత్తింది. అయితే ఈ విషయంపై ముందే ఆలోచించిన రాష్ట్ర ప్రభుత్వం తరువాత పరిస్థితి కూడా ముందుగానే ఊహించి ఏంచెయ్యాలనే విషయంపై స్పష్టతతో ఉందట. న్యాయనిపుణుల అంచనా ప్రకారం నిబంధనల్లో వెసులుబాటు అనుసరించి డిజిపి సాంబశివరావు పదవీ కాలాన్ని ఎపి ప్రభుత్వం మరో 6 నెలల పాటు పొడిగించే అవకాశం ఉందట. కాబట్టి 2017డిసెంబర్ 31 తేదీ న సాంబశివరావు రిటైర్ అయినా ఆయన పదవిని మరో మూడు నెలలు,మూడు నెలలు చొప్పున ఆరు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించే అవకాశం ఉంది. తద్వారా నండూరి సాంబశివరావు పదవీ విరమణ అనంతరం పూర్తి స్థాయి డిజిపి హోదాలో అన్ని బెనిఫిట్స్ పొందడానికి వీలవుతుంది.
ప్రస్తుతానికి కథ కంచికి....
కేంద్రం రెండుసార్లు రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాను తిప్పిపంపడంతో పతాకస్థాయికి చేరిన ఉత్కంఠకు ఎపి ప్రభుత్వం తాజా నిర్ణయంతో తెరపడింది. దీంతో ఏంజరుగుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి ఏం జరగబోతుందో ఎపి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది.
గుసగుసలు...
అయితే డిజిపి నియామకం ఇంత ఉత్కంఠ భరితంగా మారడానికి ఆ శాఖలోని కొందరు సీనియర్ అధికారులే కారణమని ప్రచారం జరుగుతోంది. సాంబశివరావు తరువాత సీనియర్లు గా ఉన్న పోలీస్ అధికారులు నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి డిజిపి పదవికి తామే అర్హులమన్న కారణంతో తమ ఉత్తరాది పలుకుబడిని ఉపయోగించారని, అందువల్లే నిబంధనలు పాటించాలంటూ జాబితా పదే పదే వెనక్కి వచ్చినట్లు పోలీసు సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఎపి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక రాష్ట్ర డిజిపి పదవి గురించి కొంతకాలం చర్చలకు బ్రేక్ పడినట్లే.