గ్రేటర్ ఫలితాలే ఏపీ స్థానిక ఎన్నికల్లో రిపీట్, టీడీపీ ఖాతా తెరవకపోవడంపై విజయసాయిరెడ్డి..
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఏపీలో చర్చకు దారితీసింది. అక్కడ ప్రతిపక్ష టీడీపీ కూడా పోటీ చేసి ఖాతా తెరవలేదు. దీంతో అధికార వైసీపీ మాటల దాడికి దిగింది. అక్కడే కాదు.. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి అని సెటైర్లు వేస్తున్నారు ఆ పార్టీ నేతలు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. తెలుగుదేశం పార్టీపై తనదైన శైలిలో విమర్శలు చేశారు.
వాస్తవానికి గ్రేటర్లో టీడీపీ 106 స్థానాల్లో పోటీ చేసింది. జీహెచ్ఎంసీలో 150 స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. అన్నీ చోట్ల పోటీ చేయమని.. పార్టీ బలంగా ఉన్న చోటే పోటీ చేస్తామని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రమణ ప్రకటించారు. 106 చోట్ల పోటీ చేసినా.. కనీసం ఒక్క సీటు కూడా గెలచుకోలేదు. ఈ విషయాన్ని విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. హైదరాబాద్లో జరిగినట్టే ఏపీలో జరిగే స్థానిక ఎన్నికల్లోనూ ఇదే సీన్ అని పేర్కొన్నారు. విజయసాయి హాట్ కామెంట్స్ గురించి టీడీపీ స్పందించాల్సి ఉంది.
ఇప్పటి కన్నా 2016లో నయం అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేశ్, బాలకృష్ణ, సుహాసిని తదితరులు ప్రచారం చేశారు. ఆ సమయంలో ఒక్క సీటును టీడీపీ దక్కించుకుంది. అప్పుడు కూడా పార్టీ అభాసుపాలయ్యింది. అందుకేనేమో ఈ సారి దూరంగా ఉన్నారు. దూరంగా ఉండటంతో ఆ ఒక్క సీటు కూడా గెలచుకోలేదు. దీంతో టీడీపీ స్థాయి పెరుగుతుందో.. దిగజారుతుందో తెలియడం లేదన్నారు. అందుకు గ్రేటర్ ఫలితాలే సజీవ సాక్ష్యం అని విజయసాయి రెడ్డి అన్నారు.