సింధుపై ఫేస్బుక్లో ప్రముఖ దర్శకుడి వెకిలి రాతలు: మండిపడ్డ నెటిజన్లు
అమరావతి: కొంత మంది వ్కక్తులు ఉన్నత స్థానాల్లో ఉన్నా, వాళ్ల మనసులు సంకుచితంగానే ఉంటాయనడానికి ఇదొక ఉదాహరణ. రియో ఒలింపిక్స్లో భారత్కు రజత పతకం అందించినందుకు సింధుని యావత్ భారతావని అభినందిస్తుంటే, ఓ మళయాళ దర్శకుడు మాత్రం ఆమెపై వ్యంగ్యంగా మాట్లాడాడు.
ఆయన పేరు సనల్ కుమార్ శశిధరన్. ఆయన దర్శకత్వం వహించిన 'ఒరివు దివసాథే కలి' అనే సినిమాకు జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. తన ఫేస్బుక్ ఖాతాలో పీవీ సింధుపై గేలిచేసేలా వ్యాఖ్యలు చేశాడు. ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదా అని ఇష్టానుసారం రాతలు రాశాడు.
సనల్ కుమార్ శశిధరన్ రాతలపై సోషల్ మీడియా మొత్తం ఏకమైంది. నెటిజన్లు సైతం సనల్ కుమార్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. పీవీ సింధును భారతజాతి మొత్తం సమున్నతంగా గౌరవిస్తున్న సమయంలో శశిధరన్ ఆ వెకిలి రాతలు ఏంటని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇంతలా ఆగ్రహం తెప్పిస్తున్న ఆ వ్యాఖ్యలు ఏంటో ఒక్కసారి చూద్దాం. ''సింధు సాధించిన విజయాన్ని అందరూ వేడుకగా జరుపుకుంటున్నారు. దీని మీద నేను ఉమ్మితే ఏమవుతుంది? దీన్ని అంతగా వేడుకగా జరుపుకోవడానికి ఏముంది ఇందులో?'' అని శశిధరన్ రాశాడు.
సామాజిక మాధ్యమాల్లో శశిధరన్ రాతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విమర్శలను తట్టుకోలేని శశిధరన్ ప్రతి స్పందించారు. తాను వ్యంగ్యంగా రాశానని, తన భావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని వాపోయాడు. ఈ విషయంలో కేరళీయులు మొత్తం పీవీ సింధు వైపు నిలబడి శశిధరన్పై తీవ్ర స్థాయిలో విమర్శించారు.