సంచైత దూకుడు- వైసీపీకి తలనొప్పులు-తాజాగా మాన్సాస్లో మరో వివాదం...
విజయనగరం జిల్లాలో పూసపాటి రాజవంశీయులకు చెందిన మాన్సాస్ ట్రస్టు ఛైర్పర్సన్గా వైసీపీ ప్రభుత్వం తెచ్చిపెట్టుకున్న బీజేపీ యువమోర్చా నేత సంచైత గజపతిరాజు ఇప్పుడు ప్రభుత్వాన్నే లెక్కచేయడం లేదా ? మాన్సాస్తో పాటు సింహాచలం దేవస్ధానం వ్యవహారాల్లో ప్రభుత్వం సూచనలను ఆమె పట్టించుకోవడం లేదా ? ప్రభుత్వం స్వేచ్ఛగా పనిచేసుకునే అవకాశం ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా సర్కారునే ఇరుకునపెడుతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. చివరికి తనను నియమించిన దేవాదాయశాఖ అధికారులను కూడా పరిగణనలోకి తీసుకోకుండా సంచైత తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వానికి తలనొప్పిగా తయారవుతున్నాయన్న వాదన వినిపిస్తోంది.
సంచైత దూకుడు నిర్ణయాలు..
గతేడాది మాన్సాస్ ఛైర్మన్గా ఉన్న టీడీపీ నేత అశోక్ గజపతిరాజును పక్కనబెట్టి అర్ధరాత్రి జీవోలతో బీజేపీ యువమోర్చా నేతగా ఉన్న సంచైత గజపతిరాజును ప్రభుత్వం ఛైర్పర్సన్గా తెరపైకి తెచ్చింది. అంతకుముందు ఆమెకు పాలనా వ్యవహారాల్లో అంతగా అనుభవం లేకపోయినా రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకని వైసీపీ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. పరిస్ధితులను బట్టి లౌక్యంగా పనిచేసుకోవాలని ఆమెకు పలు సూచనలు కూడా చేసింది. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి సంచైత నిర్మొహమాటంగా తనకు నచ్చిన నిర్ణయాలే తీసుకుంటున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె దేవాదాయశాఖ అధికారులను సైతం లెక్కచేయడం లేదని తెలుస్తోంది.
మాన్సాస్, సింహాచలంలో వివాదాలు..
సింహాచలం దేవస్ధానం బోర్డు ఆమోదించకుండానే తాను నియమించుకున్న ఓఎస్టీ అనధికారికంగా దేవస్ధాన సత్రంలో మకాం వేసి బోర్డు ఫైళ్లను తిరగేసే దాకా వ్యవహారం వెళ్లినా సంచైత మాత్రం ఏమీ పట్టనట్టుగానే ఉండిపోయింది. దీంతో విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. చివరికి బోర్డులో ఆమోదం పొందినా అప్పటికే జరగరాని నష్టం జరిగింది. తాజాగా మాన్సాస్ ట్రస్టుకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఇసుక ర్యాంపులకు అనుమతి విషయంలోనూ దేవాదాయశాఖ అధికారులకు తెలియకుండా ఒప్పందాలు చేసుకోవడం మరో వివాదానికి కారణమైంది. మాన్సాస్ ఈవోకు తెలియకుండా ఇసుక తవ్వకాల కోసం ఏపీఎండీసీతో ఒప్పందం చేసుకోవడం ద్వారా దేవాదాయశాఖతో తనకు పనేముందన్న సంకేతాలను సంచైత పంపడం ఇప్పుడు వైసీపీ సర్కారుకు సైతం మింగుడు పడటం లేదు.
ప్రభుత్వ శాఖల మధ్య చిచ్చు...
ఇసుక తవ్వకాల కోసం నిబంధనలను ఉల్లంఘించి మాన్సాస్ ట్రస్టు ఏపీఎండీసీతో చేసుకున్న ఒప్పందం ఇప్పుడు దేవాదాయ, గనుల శాఖల మధ్య చిచ్చు రేపుతోంది. ట్రస్టు బోర్డు తీర్మానం లేకుండా, తనకు తెలియకుండా ఏపీఎండీసీతో ఛైర్పర్సన్ సంచైత చేసుకున్న ఒప్పందంపై మాన్సాస్ ఈవో దేవాదాయశాఖ కమిషనర్కు పిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో సంచైత నిర్ణయం కారణంగా ప్రభుత్వ శాఖల మధ్య అనవసర వివాదం తలెత్తినట్లయింది. దీంతో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని దీన్ని ఎలా సరిచేస్తారో చూడాల్సి ఉంది.
Recommended Video
పట్టుదలా ? మూర్ఖత్వమా
మాన్సాస్ ట్రస్టుతో పాటు సింహాచలం దేవస్ధానం వ్యవహారాల్లో నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ సంచైత వీటిని పట్టించుకోకుండా ముందుకెళ్లడం అసలు సమస్యలకు కారణమవుతోంది. రాజకీయ అనుభవం లేకపోయినా, పాలనా అనుభవం లేకపోయినా కీలక నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తే సరిపోతుంది. కానీ నిబందనలను, అధికారులను కూడా లెక్కచేయకుండా ముందుకెళ్లడం ద్వారా తనను ఏరికోరి నియమించిన వైసీపీ ప్రభుత్వానికే సంచైత తలనొప్పులు తీసుకురావడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తొలుత అవగాహన లేమి అనుకున్నా తాజాగా పరిస్ధితులు గమనిస్తున్న వారికి ఇదంతా సంచైత కావాలనే చేస్తోందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ను సంచైత దుర్వినియోగం చేస్తోందా అన్న చర్చ కూడా సాగుతోంది.