మాన్సాస్ పదవిలో సంచైతా ఎంపిక అశోక్ తో పాటు బీజేపీకి భారీ షాక్ ? ఉత్తరాంధ్ర పాలిటిక్స్ లో కీలక మలుపు
విజయనగరంలోని మాన్సాస్ ట్రస్టుతో పాటు సింహాచలం బోర్డు ఛైర్ పర్సన్ గా బీజేపీ యువమోర్చా నేత సంచైతా గజపతిరాజును వైసీపీ ప్రభుత్వం ఎంపిక చేయడం ఉత్తరాంద్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పనుంది. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా భవిష్యత్ రాజకీయాలు నడపాలనుకుంటున్న వైసీపీ ముందస్తు వ్యూహంలో భాగంగానే తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనడంలో సందేహం లేదు.
మాన్సాస్ ఛైర్ పర్సన్ గా సంచైతా ఎంపిక
విజయనగరంలోని మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) ట్రస్టు ఛైర్ పర్సన్ గా బీజేపీ యువమోర్చా నేత సంచైతా గజపతిరాజును వైసీపీ ప్రభుత్వం ఎంపిక చేయడం ఉత్తరాంద్ర రాజకీయాల్లో కీలక మలుపుగా చెప్పవచ్చు. చడీ చప్పుడు కాకుండా అర్ధరాత్రి జీవోలతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో స్ధానికంగా ఎన్నో సమీకరణాలను మార్చబోతోందన్న అంచనాలు ఉన్నాయి. మాన్సాస్ ట్రస్టుతో పాటు సింహాచలం బోర్డు ఛైర్ పర్సన్ గానూ సంచైతాను ఎంపిక చేయడం, వైసీపీ ఎమ్మెల్యేలు ఆమెను దగ్గరుండి ప్రమాణ స్వీకారం చేయించడం చూస్తుంటే భవిష్యత్తులో అక్కడ ఏం జరగబోతోందో ఇట్టే ఊహించవచ్చు.
సంచైతా ఎంపికను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోంది ?
పూసపాటి రాజవంశానికే చెందిన సంచైతా గజపతిరాజు చాలా కాలంగా రాజకీయాల్లో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ యువమోర్చా జాతీయ కార్యదర్శిగా ఉన్నా ఆమెకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. దీంతో తనకు స్ధానబలం ఎక్కువగా ఉండే విజయనగరం నుంచే చక్రం తిప్పాలని నిర్ణయించుకున్నారు. దీంతో గతేడాది డిసెంబర్ లోనే ఆమె తనకు సింహాచలం బోర్డులో స్ధానం కల్పించాలని వైసీపీ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. అయితే ఆమె కోరుకున్న దాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ప్రయోజనాన్ని వైసీపీ ఆమెకు కట్టబెట్టింది. దీంతో ఇప్పుడు సొంత పార్టీ బీజేపీ కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. సంచైతా ఎంపికను స్వాగతించాల్సిన బీజేపీ స్ధానిక ఎమ్మెల్సీ, భవిష్యత్తులో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రేసులో ఉన్న మాధవ్.. తాము దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ రాజకీయాల్లో భాగంగానే సంచైతాకు పదవి దక్కిందని తాము భావిస్తున్నామన్నారు.
సంచైతా రాకతో వైసీపీ ఏం లాభం
విజయనగరంలోని పూసపాటి రాజవంశీకురాలన్న ట్యాగ్ తప్ప రాజకీయాల్లో ఎలాంటి పదవులు కానీ, అనుభవం కానీ లేని సంచైతా రాకతో వైసీపీకి ఎలాంటి లాభం ఉంటుందన్న చర్చ మొదలైంది. అయితే ఇప్పటికిప్పుడు లాభం ఉండకపోయినా ప్రస్తుతానికి వైసీపీ ప్రత్యర్దులుగా ఉన్న టీడీపీ, బీజేపీని గట్టి దెబ్బ తీయాలన్న లక్ష్యంతోనే వైసీపీ ఆమెకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చినట్లు అర్దమవుతోంది. ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ పోరులో విజయనగరం జిల్లాలో అన్ని స్ధానాలు గెల్చుకుని క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ... భవిష్యత్తులో ఈ ఫీట్ ను సుస్ధిరం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో వారికున్న ప్రధాన అడ్డంకి టీడీపీ సీనియర్ నేత, జిల్లాలో మర్యాదస్తుడిగా పేరున్న అశోక్ గజపతిరాజు, ఆయన కుమార్తె ఆదితి గజపతిరాజు. సార్వత్రిక ఎన్నికల్లో వీరిద్దరూ ఓటమిపాలయ్యారు. కానీ భవిష్యత్తుల్లో వైసీపీ నేతలపై వ్యతిరేకత పెరిగితే ప్రజలు తిరిగి వీరిద్దరికే పట్టం గట్టే అవకాశముంది. పదవుల్లో లేకపోయినా పూసపాటి వంశీయుుల హవా అక్కడ ఎలాగో కొనసాగుతుంటుంది. దీనికి అడ్డుకట్ట వేయడంతో పాటు అదే వంశానికి చెందిన సంచైతాకు అవకాశం కల్పించడం ద్వారా ఆమెను ప్రోత్సహించి వీరిద్దరినీ దెబ్బతీయాలనేది వైసీపీ వ్యూహం.
Recommended Video
సంచైతా రాకతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మలుపు
సంచైతా మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ కావడంతో దాని పరిధిలో ఉన్న వందకు పైగా ఆలయాలపై ఆమెకు పట్టు చిక్కుతుంది. అదే సమయంలో అవి విస్తరించి ఉన్న మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాజకీయం కూడా ఆమెకు అనుకూలంగా మారుతుంది. ఇదంతా తిరిగి వైసీపీ నేతల కన్నుసన్నల్లోనే జరుగుతుంది. మళ్లీ ఇది ఎటుతిరిగీ వైసీపీకే ఉపయోగపడుతుంది. సంచైతాను వైసీపీ ఇంతగా ప్రోత్సహించడం వెనుక ప్రధాన కారణాలివే.