ఇసుక ఉచితం, వారానికి 5 పనిదినాలు!: బాబు సంచలన నిర్ణయాలు
హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఏపీలో ఉచితంగా ఇసుకను ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం బిల్డర్లు, ఇతర వర్గాలతో చర్చించాలని నిర్ణయించారు. సోమ, మంగళవారాల్లో ఈ నిర్ణయం ఓ కొలిక్కి రానుంది.
శుక్రవారం సీఎం చంద్రబాబు కలెక్టర్లు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్నేళ్ల నుంచి ఇసుక కోసం ఏపీ ప్రజలు పడుతున్న కష్టాలకు తద్వారా చెల్లుచీటీ పలకాలని భావిస్తున్నారు. ఇసుక ధర తగ్గించడం కాకుండా... ఏకంగా ఉచితంగా ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
డ్వాక్రా మహిళలకు ఇసుక రేవులు, వేలంపాటలు ఇలా ఏ విధానం తెచ్చినా ప్రజలకు మాత్రం కష్టాలు తప్పలేదని భావించిన చంద్రబాబు చివరకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలనుకున్నారు. ఇసుక అంశంపై నిర్వహించిన ఈ సమావేశంలో చంద్రబాబు హఠాత్తుగా.. ఇసుకను ఉచితంగా ఇచ్చేద్దామని పేర్కొన్నారు.
ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు చూస్తూ ఉండడం సరికాదని, ఇసుకను ఉచితంగా ఇచ్చేద్దామని చెప్పారు. ఇసుకపై వచ్చేది రూ.200 కోట్లు మాత్రమేనని, దీనికోసం ఇంత హంగామా అవసరమా? అని ప్రశ్నించారు.
ఇళ్లు, భవనాల నిర్మాణాలకు, ప్రభుత్వ పనులకు అన్నింటికీ ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రజలు రవాణా ఖర్చు మాత్రమే భరించాల్సి ఉంటుంది. ఇసుకను నిత్యావసర వస్తువుల జాబితాలోకి తెద్దామని చంద్రబాబు ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది.
అయితే, అక్రమంగా నిల్వ చేయడం, సరిహద్దులు దాటించడం, సిండికేట్లుగా ఏర్పడి రేవులపై ఆధిపత్యం చలాయించాలని ప్రయత్నించడం ఇలాంటి వాటన్నింటినీ తీవ్ర నేరంగా పరిగణించనున్నారు. ఇసుక ఉచితంగా ఇవ్వడం ఖాయమని, దీనిపై ఎలాంటి విధివిధానాలు ఉండాలన్న దానిపై రెండ్రోజుల పాటు మంత్రులు, అధికారులు ఆలోచించాలని సూచించారు. ఇందుకోసం సోమ, మంగళవారాలు భేటీ కానున్నారు.
ఐదు రోజులే పని దినాలు!
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచే పూర్తి స్థాయి పరిపాలనను నిర్వహించాలని భావిస్తున్న సీఎం చంద్రబాబు.. జూన్ నాటికి మొత్తం అన్ని శాఖలను అమరావతికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అమరావతిలో పూర్తి స్థాయిలో భవన నిర్మాణాలు లేకపోవడం, నివాస గృహాలకు ఉన్న కొరత దృష్ట్యా ఉద్యోగులు సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు.
ఇప్పటికిప్పుడు అమరావతికి తరలిరావడానికి తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే వారానికి ఐదు రోజుల పని దినాలు విధానాన్ని తేవాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
పనిదినాలు తగ్గిపోతున్న క్రమంలో కొన్ని గంటల పాటు అదనపు పని చేస్తే సరిపోతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం సదరు అదనపు పనిని ఉద్యోగులు ఇంటి నుంచే చేసేలా ప్రతిపాదించారు. దీనిపై ప్రామాణికత, మార్గదర్శకాలపై కసరత్తు చేయాలని ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తద్వారా వారానికి ఐదు రోజుల పని దినాల విధానం అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది.