ఏపీలో ఇసుక తిప్పలు .. 10 కిలోమీటర్ల మేర ట్రాక్టర్ల బారులు
ఏపీ లో ఇసుక కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గుప్పెడంత ఇసుక కోసం నిర్మాణరంగం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇసుకో రామచంద్ర అని ప్రాధేయ పడుతున్నా పట్టించుకోని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది . ఇసుక అమ్మకాలను నిలిపివేసి నిర్మాణ రంగాన్ని కుదేలు చేసిన సర్కార్ నిర్ణయంపై అసహనం వ్యక్తం అవుతుంది .
చంద్రబాబు ఓ హై టెన్షన్ వైర్ .. ముట్టుకుంటే బూడిదే అంటున్న టీడీపీ ఎమ్మెల్సీ
ఏపీలో ఇసుక కష్టాలు... జగన్ నిర్ణయంతోనే నిర్మాణ రంగం కుదేలు
ఏపీలో వైసిపి అధికారంలోకి వచ్చాక ఇసుక కష్టాలు మాత్రం వర్ణనాతీతంగా తయారయ్యాయి .ప్రభుత్వం పాత ఇసుక విధానాన్ని రద్దు చేయడంతో నిర్మాణ రంగంలో ఉన్న వారికి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం టిడిపి ప్రభుత్వ హయాంలో ఉన్న పాత పాలసీని రద్దుచేసి కొత్త పాలసీని తీసుకొచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఇసుకను ఉచితంగా రవాణా చేసేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చి ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక విక్రయించాలని నిర్ణయించింది. ట్రాక్టర్ ఇసుక ధర 330 రూపాయలుగా నిర్ణయించి అందించనుంది .
ఇసుక కోసం తిప్పలు .. తోట్లవల్లూరు ఇసుక క్వారీ వద్ద పది కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు బారులు
అయితే ఏపీ లో ఇసుకకి తీవ్ర కొరత ఏర్పడడంతో భవన నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. విపరీతమైన ఇసుక కొరత ఏర్పడడంతో ఈ మధ్యనే క్వారీలను తెరిచిన వైసిపి ప్రభుత్వం అధికారుల సమక్షంలో ఇసుక అమ్మకాలను సాగిస్తోంది . ఇక కృష్ణా జిల్లాలో ఇసుక కోసం జనాలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారు అంటే తోట్లవల్లూరు లోని ఇసుక క్వారీ వద్ద ఏకంగా పది కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు బారులుతీరి ఉన్న పరిస్థితి. ఇక ట్రాక్టర్ డ్రైవర్లు వరుసక్రమంలో బండ్లు నిలిపి ఎప్పుడు తమదాకా ఇసుక వస్తుందని ఎదురు చూడాల్సిన దుస్థితి. వేలాది ట్రాక్టర్లు క్వారీల వద్ద బారులు తీరి పడిగాపులు కాస్తున్న స్థితి ఇసుక కొరతను కళ్లకు కట్టినట్లు చూపుతుంది.
బ్లాక్ మార్కెట్లో ట్రాక్టర్ ఇసుక ధర 15 వేలు .. తీవ్ర నష్టంలో నిర్మాణ రంగం
వైసీపీ ప్రభుత్వ ఇసుక సరఫరాను ఆపుతూ తీసుకున్న నిర్ణయం ఇప్పట్లో నిర్మాణ రంగానికి ఉపశమనం కలిగించేలా కనిపించడం లేదు. బ్లాక్ మార్కెట్లో ట్రాక్టర్ ఇసుక ధర 15 వేల రూపాయల వరకూ పలుకుతోంది అంటే తాజా పరిస్థితి ఇట్టే అర్థమవుతుంది. అంత ధర పెట్టి కొనలేక , ఇప్పట్లో ఇసుక దొరుకుతుంది అన్న నమ్మకం లేక నిర్మాణ రంగంలోని వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మొత్తానికి వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఏపీ లోని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. నిర్మాణ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో జగన్ సర్కార్ నిర్ణయం నిర్మాణ రంగానికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది.