తెలుగు రాష్ట్రాల మధ్య ఇసుక రగడ .. ఏపీ వాహనాలను సీజ్ చేసిన తెలంగాణా అధికారులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఏపీ లిఫ్ట్ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోయాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడం ముగియక ముందే తుంగభద్రా నదిలో ఇసుక తవ్వకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం నెలకొంది. ఇక తెలుగురాష్ట్రాల సరిహద్దుగా ఉన్న చోట తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలపై అంతర్రాష్ట్ర సరిహద్దు అంశం ఇప్పుడు ఇరు రాష్ట్రాలకు టెన్షన్ పుట్టిస్తోంది.
తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త జల జగడం ... తగ్గేదెవరో... నెగ్గేదెవరో !!
తుంగభద్రా నదిలో ఇసుక తవ్వకాలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం
తుంగభద్రా నదిలో ఇసుక తవ్వకాలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది . ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . దీంతో కర్నూలు జిల్లాకు చెందిన మైనింగ్ అధికారులు కర్నూలు జిల్లా శ్రావణ బెలగొళ మండలం గుండ్రేవుల దగ్గర తుంగభద్ర నదిలో ఇసుకను తరలించటానికి వాహనాలు పంపారు . ఇక అక్కడ ఇసుక రీచ్ వద్ద తవ్వకాలు జరుపుతున్న క్రమంలో జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం చిన్న ధన్వాడ గ్రామస్తులు తమ పరిధిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఆందోళనకు దిగారు. ఇది తమ బోర్డర్ అని ఏపీ నుండి వెళ్ళిన వారు చెప్పారు.
సరిహద్దులో ఇసుక రీచ్ వద్ద ఘర్షణ .. ఏపీ వాహనాలు సీజ్ చేసిన తెలంగాణా అధికారులు
ఇరు వర్గాల మధ్య వాదన జరిగింది . ఇక దీంతో ఏపీ వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా చిన్న ధన్వాడ గ్రామస్థులు పోలీసులకు , మైనింగ్ శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుండ్రేవుల రీచ్ వద్ద ఇసుక తవ్వేందుకు వెళ్లిన వాహనాలను తెలంగాణ అధికారులు సీజ్ చేశారు.వాహనాలను తెలంగాణాకు తరలించారు . ఇక దీంతో ఏపీ అధికారులు తెలంగాణా అధికారులతో చర్చించారు. తమ పరిధిలోనే తవ్వకాలు జరిపామని స్పష్టం చేశారు . వారి మధ్య ఏకాభిప్రాయం రాకపోవటంతో ఇరు రాష్ట్రాల అధికారులు గుండ్రేవుల రీచ్ ను పరిశీలించారు . ఇక ఈ ఘటన నేపధ్యంలో అంతర్ రాష్ట్ర ఇసుక సరిహద్దులను గుర్తించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు సర్వే చేపట్టారు.
Recommended Video
సరిహద్దుల సర్వే చెయ్యనున్న అధికారులు ..వివాదం సద్దు మణుగుతుందా ?
అయితే ఉమ్మడి రాష్ట్ర మ్యాప్ ఆధారంగా సర్వే చెయ్యాలని తెలంగాణా , విభజన తర్వాత మ్యాప్ ల ఆధారంగా సర్వే చెయ్యాలని ఆంధ్ర అధికారులు పటు పట్టటంతో సర్వేలో ఏకాభిప్రాయం కుదరక అది కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది . తమ సరిహద్దుల్లోనే తవ్వకాలు జరిగాయని కర్నూలు మైనింగ్ అధికారులు చెబుతున్నారు. లేదు తెలంగాణా సరిహద్దులో తవ్వకాలు జరిపారని తెలంగాణా వాదిస్తుంది. ఏది ఏమైనా వచ్చే సోమవారం జరగనున్న సర్వేలో అయినా ఈ వివాదం సద్దు మణుగుతుందో లేదో వేచి చూదాల్సిందే.