ఏపీలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా : వీఆర్వోలపై దాడి, కఠిన చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్
శ్రీకాకుళం : ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఆగడాలపై ప్రశ్నించిన అధికారులపై దాడికి తెగబడుతున్నారు. అక్రమ రవాణాను రాచమార్గం చేసుకొని ... అదేంటని ప్రశ్నించిన అధికారులపై భౌతికదాడులకు దిగుతూ భయాందోళనకు గురిచేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు శృతిమించాయి. అడ్డుకొన్ని రెవెన్యూ సిబ్బంది తలపై దాడి చేసేంత ధైర్యం వారికొచ్చింది. వీరి ఆగడాలపై ఉన్నతాధికారులు స్పందించారు. అధికారులపై దాడులను సహించబోమని తేల్చిచెప్పారు. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మళ్లీ ఎవరైనా దాడిచేసేందుకు భయపడేలా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
మితిమీరిన ఆగడాలు ..
శ్రీకాకుళం జిల్లా నైరాలో ఇసుక బకాసురులు అడ్డు, అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో వీఆర్వో చంద్రశేఖర్, విశ్వేశ్వరరావు రాత్రి వాగులోకి వెళ్లారు. అయితే వారిని చూసినా ... ఇసుక మాఫియా రెచ్చిపోయింది. తమతో పాటు ఉ్న కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారు దీంతో ఇద్దరు వీఆర్వోలు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే వారి పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.
పరుగుతీసిన మరో ఇద్దరు ..
మరో ఇద్దరు వీఆర్వోలు అక్కడ నుంచి పరుగులు తీశారు. తహసీల్దార్ కె.వేణుగోపాల్, ఎస్సై చిన్నంనాయుడు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి గ్రామస్థులతో మాట్లాడారు. అధికారులపై దాడులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గాయపడిన వీఆర్వోలను చికిత్స నిమిత్తం శ్రీకాకుళంలోని రిమ్స్కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీఆర్వోలను జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ చక్రధరబాబు బుధవారం ఉదయం పరామర్శించారు.
ఉపేక్షించం
ఇసుక మాఫియా దాడుల గురించి జిల్లా అధికారులకు తెలిసింది. రెవెన్యూ సిబ్బందిపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలిపెట్టబోమని జిల్లా కలెక్టర్ జే నివాస్ పేర్కొన్నారు. ఇసుక దోపిడిన అడ్డుకునేందుకు సిబ్బంది .. రేయనక, పగలనక కష్టపడుతుంటే ... మాఫియా దాడులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఒత్తిడిలకు లొంగకుండా కేసు నమోదు చేయాలని ఎస్పీని ఆదేశించారు.