అందరికీ అందుబాటులోకి రానున్న ఇసుక ..ఆన్ లైన్ బుకింగ్ కు సర్వం సిద్ధం
ఏపీలో కరోనా లాక్ డౌన్ దెబ్బకు ఇసుక సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో నిర్మాణ రంగం మరోమారు కరోనా లాక్ డౌన్ దెబ్బకు కుదేలైంది. ఇక తాజాగా ఇసుక అందరికీ అందుబాటులోకి తీసుకురావటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకటి రెండురోజుల్లో ఇసుక ఆన్లైన్ బుకింగ్కు అనుమతి లభించనుంది. లాక్డౌన్ కారణంగా కుదేలైన నిర్మాణ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే ఇసుక సరఫరాపై దృష్టి పెట్టింది.
ఇసుక సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం
49 రోజులుగా నిర్మాణ రంగ కార్మికులు పనుల్లేక కూలీలు సైతం అల్లాడిపోతున్నారు. లాక్ డౌన్ కారణంగా మార్చి నెల 22 నుంచి ఇప్పటివరకు ఇసుక నిర్మాణ రంగానికి కావలసిన ఇసుక సరఫరా కాలేదు . ఇక ఇప్పుడు నిర్మాణ రంగంలో పనులు ఊపందుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్ ఇసుక కొరతను తీర్చేందుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిన నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ లో ఇసుక బుకింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆన్లైన్లో కూడా బుకింగ్ చేసుకునేలా ప్రభుత్వ చర్యలు
ఇక ఇసుక తరలింపునకు ప్రభుత్వం ఓకే చెప్పింది. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో గతంలో బుక్ చేసుకున్న వారికి, ప్రభుత్వ పనులకు ప్రస్తుతం డోర్ డెలివరీ ప్రారంభించారు. ఇక దీంతో ఇసుక అవసరం ఉన్నవారు ఆన్లైన్లో కూడా బుకింగ్ చేసుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది . ఈ వ్యవస్థను పర్యవేక్షించేందుకు జిల్లాకు ప్రత్యేక డిప్యూటీ డైరెక్టర్ను కూడా నియమించి మరీ ఇసుక సరఫరాపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం.
Recommended Video
భవిష్యత్ లో ఇసుక కష్టాలు లేకుండా ఏర్పాట్లు
ఇక మే తర్వాత జూన్ నెలలో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉన్న నేపధ్యంలో ఇసుక కొరత లేకుండా ఉండే విధంగా అన్ని చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. ముందస్తుగా స్టాకు యార్డులకు ఇసుక తరలించి నిల్వ చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న అధికార యంత్రాంగ భవిష్యత్ లో ఇసుక కష్టాలు లేకుండా చెయ్యాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే అన్ని చోట్ల ర్యాంపులను తెరిచి ఇసుకను స్టాక్ యార్డులకు తరలిస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రజల నిర్మాణ అవసరాలకు ఇసుక ఇవ్వనున్న నేపధ్యంలో ఏపీలో నిర్మాణ రంగ పనులు మొదలయ్యే అవకాశం ఉంది.