జగన్ ప్రభుత్వం కార్మికులను కన్నీరు పెట్టిస్తుందని విపక్షాలు: పవన్కు మద్దతు, అందుకే ఆ పార్టీలు దూరం!
విశాఖపట్నం: రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో లాంగ్ మార్చ్కు సిద్ధమవుతోంది. ఈ ఆందోళనలో తెలుగుదేశం పార్టీ ప్రత్యక్షంగా పాల్గొంటుంది. బీజేపీ, సీపీఐ, సీపీఎం, లోక్సత్తా పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. మధ్యాహ్నం 3 గంటలకు శాండ్ మార్చ్ ఉంది. లాంగ్ మార్చ్ కోసం జనసైనికిలు భారీగా తరలి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ హాజరు కానున్న ఈ శాండ్ మార్చ్కు పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు హాజరవుతున్నారు.
కార్మికులను కన్నీరు పెట్టిస్తున్న జగన్ ప్రభుత్వం
ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన ఇసుక విధానం ద్వారా భవన నిర్మాణ కార్మికులకు కన్నీరు పెట్టిస్తోందని ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం, సీపీఐలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేవలం గత ప్రభుత్వంపై కక్ష సాధింపుతో కొత్త ఇసుక విధానం అంటూ వైసీపీ ప్రభుత్వం తెరపైకి తీసుకు వచ్చిందని, ఇది కార్మికులకు ఉపాధి లేక కంటనీరు పెట్టిస్తుండటంతో పాటు ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారికి ఇబ్బందికరంగా మారి వారి వ్యయం ఎక్కువయ్యేలా చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఉపాధి కోల్పోతున్న కార్మికులు
దేశంలో ఎక్కడా లేని విధంగా ఇసుక కారణంగా భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోవడం జగన్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. భవ నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోవడంతో పాటు పలువురు మృతి చెందారని వాపోతున్నారు. ఎందరో కార్మికులు రోడ్డున పడ్డారని చెబుతున్నారు.
సమస్యలపై ఎప్పటికప్పుడు జనసేనాని స్పందన
పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సమస్యలపై స్పందిస్తున్నారు. ఆయన పార్టీ మనుగడ కోసం రాజకీయాలు చేయడం లేదని, 2014 నుంచి ప్రభుత్వం చేసే తప్పులపై పోరాడుతున్నారని జనసైనికులు గుర్తు చేస్తున్నారు. రాజధాని రైతుల నుంచి బలవంతంగా భూమిని లాక్కోవడంపై, ఉద్దానం వంటి వివిధ సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వంపై జనసేనాని ఉద్యమించారు. ఇందులో భాగంగా కృత్రిమ ఇసుక కొరత సృష్టించి ప్రజల ఆగ్రహాన్ని మూటగట్టుకున్న జగన్ ప్రభుత్వంపై జనసేనాని లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారన్నారు. ఇసుక విధానంపై ప్రభుత్వం తీరును ఎండగట్టనున్నారు.
జగన్ ప్రభుత్వం తీరుతో రోడ్డున పడ్డ కార్మికులు
జగన్ ప్రభుత్వం కృత్రిమ ఇసుక కొరతను సృష్టించడం ద్వారా 33వేల మందికి పైగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. గత ప్రభుత్వం ఇసుక విధానంపై విమర్శలు గుప్పించిన వైసీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక భవన నిర్మాణ కార్మికులను రోడ్డుపైకి తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాము రోడ్డు మీదకు వచ్చేందుకు ఎన్నికలు లేవని, కానీ ఇసుక కారణంగా కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని చెబుతున్నారు. ఈ ఇసుక విధానం ద్వారా పలువురు మృతి చెందారన్నారు. ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని, కార్మికులు, ప్రజల సమస్యలు జగన్ ప్రభుత్వం వినాలని నాదెండ్ల విజ్ఞప్తి చేశారు.
వైసీపీ అసత్య ప్రచారం నమ్మవద్దు
భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఆదివారం విశాఖపట్నంలో తలపెట్టిన జనసేన లాంగ్ మార్చ్కు రాష్ట్రం నలుమూలల నుంచి తరలిరావాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. విశాఖలోని ట్రేడ్ యూనియన్ నాయకుల సహాయ సహకారాలను కోరామని, లాంగ్ మార్చ్కు పోలీసు శాఖ నుంచి అనుమతి వచ్చిందని, వైసీపగీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని పవన్ కోరారు.
ఆ పార్టీలు ఎందుకు పాల్గొనడం లేదంటే..
జనసేన లాంగ్ మార్చ్లో టీడీపీ నేతలు పాల్గొంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు ఆందోళనకు సంఘీభావం తెలిపాయి. అయితే ఆ పార్టీల ప్రతినిధులు ఎవరూ పాల్గొనడం లేదు. లోక్సత్తా పాల్గొంటుంది. జనసేన లాంగ్ మార్చ్లో తాము పాల్గొనడం లేదని, కానీ ఇసుక కొరత సమస్యపై జనసేనకు సంఘీభావం తెలుపుతున్నామని ఇతర పార్టీలు ప్రకటించాయి. ఆ పార్టీలు పాల్గొనకపోవడానికి కారణాలు చెప్పాయి. బీజేపీని ఆహ్వానించడం సరికాదని అందుకే తాము పాల్గొనడం లేదని సీపీఐ, సీపీఎం పార్టీలు అభిప్రాయపడ్డాయి. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం కసరత్తు జరుగుతున్నందున కాంగ్రెస్ పాల్గొనడం లేదు. ఆయా పార్టీల సిద్ధాంతాలు లేదా కార్యక్రమాల వల్ల ఇవి పాల్గొనడం లేదు.