ప్రతిపక్షాలకు ఆయుధంగా, ఏపీ సర్కార్ కు తలనొప్పిగా ఇసుక సమస్య .. కొరతకు కారణాలు ఇవే
ఏపీలో ఇసుక కొరత అతి పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. ఇసుక కోసం ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాయి. ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి పాలనను పరుగులు పెట్టించాలని భావించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇసుక సమస్య ఇబ్బందికరంగా తయారైంది. మిగతా అన్ని విషయాల్లోనూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్న వైసీపీ ప్రభుత్వం ఇసుక విషయంలో మాత్రం అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతుంది.
బాబు..పవన్కు
అవకాశం
ఇవ్వొద్దు:
ఏపీలో
ఇసుక
వారోత్సవాలు
:
సీఎం
జగన్
ఆదేశం..!
ఏపీలో ఊహించని విధంగా ఇసుక కొరత
అసలు ఏపీ ప్రభుత్వం కూడా ఊహించని విధంగా ఇంతగా ఇసుక సమస్య ఎందుకు వచ్చింది? ఇసుక కొరతకు కారణమేంటి ? దానిని అధిగమించటానికి ప్రభుత్వం చేయబోతుంది? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పాత ఇసుక పాలసీ ని రద్దు చేసి, అవినీతికి ఆస్కారం లేకుండా నూతన ఇసుక పాలసీ ని ప్రవేశపెట్టి పారదర్శకంగా పాలన అందించాలని భావించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మే నెలాఖరులో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని రూపొందించడం కోసం సెప్టెంబర్ 5 వరకు ఇసుక తవ్వకాలను నిలిపి వేసింది ఆ తర్వాత ఆన్లైన్ పద్ధతిలో ఇసుక బుకింగ్ కు శ్రీకారం చుట్టింది.
వరదల వల్ల ఇసుక తవ్వకాలకు తీవ్ర ఇబ్బంది
సెప్టెంబర్ 5 నుండి నూతన ఇసుక పాలసీ ని ప్రారంభించిన ప్రభుత్వం నిరంతరాయంగా ఇసుక సరఫరా అయితే అప్పటివరకు ఉన్న ఇసుక కొరత తీరుతుందని భావించింది. కానీ ప్రభుత్వం ఊహించని విధంగా ఇసుక కొరత మరింత ఎక్కువైంది.అందుకు కారణం గత పదేళ్లుగా ఎన్నడూ లేని విధంగా కురుస్తున్న వర్షాలకు, వస్తున్న వరదలకు దాదాపు అన్ని నదులకు తాకిడి బాగా పెరిగింది. కృష్ణా, గోదావరి నదులకు వరద నీరు ఎక్కువగా వస్తుండడం వల్ల ఇసుక తీయడానికి అవకాశం లేకుండా పోతుంది. వరద కారణంగా 70 రీచ్ లలో ఇసుక తవ్వకాలకు అవకాశాలు లేకుండా పోవడంతో తీవ్రమైన ఇసుక కొరత ఏపీలో నెలకొంది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించిన సర్కార్
దీన్ని అధిగమించడం కోసం నదీ పరివాహక ప్రాంతాలలో, వాగుల సమీపాన రైతుల పట్టా భూములలో ఉన్న ఇసుకను సేకరించడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎంత ప్రయత్నం చేసిన ఏపీలో అవసరాలకు తగ్గట్టుగా ఇసుక మాత్రం లభించటంలేదు. ఇక దీనికి ప్రత్యామ్నాయంగా ఇసుక బదులు స్టోన్ డస్ట్ అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇక తాజాగా నెలకొన్న ఇసుక కొరత నేపధ్యంలో ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన బాట పట్టాయి.
ఇసుక కొరతతో పనుల్లేక ఆత్మహత్యలకు పాల్పడిన కార్మికులు
నిర్మాణ రంగ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని, కృత్రిమ ఇసుక కొరతకు ప్రభుత్వ విధానాలే కారణమని, ఇసుక అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇక నిర్మాణ రంగ కార్మికులు పనులు లేక, ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఇసుక కొరత సమస్య తీవ్రం కావడంతో నిర్మాణరంగం తీవ్రంగా దెబ్బతింది.
ఇసుక సమస్యకు చెక్ పెట్టే ప్లాన్ లో ఏపీ ప్రభుత్వం
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఇసుక సరఫరాపై చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు.వారం రోజులపాటు ఇసుక మీదే పనిచేసి,ఇసుక కొరత గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూద్దామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కానీ ఏపీలో తీవ్రమైన ఇసుక కొరత నెలకొన్న నేపథ్యంలో ఇసుక వారోత్సవాలు నిర్వహించినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందనేది అనుమానమే.