టిపై కిరణ్కు ఢిల్లీ కౌంటర్: సిఎంలు అడ్డుకోలేరని వ్యాఖ్య
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ కౌంటర్ ఇచ్చింది. ఫైలిన్ తుఫానును తాను ఆపలేకపోయానని కానీ విభజన ప్రక్రియను మాత్రం ఆపుతానని ముఖ్యమంత్రి ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మాట దాటవేశారు. దానిపై స్పందించలేదు.
అయితే ఏఐసిసి అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ ముఖ్యమంత్రికి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రులు విభజనను అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సందీప్ మాట్లాడారు. విభజన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రెండేళ్ల సంప్రదింపుల తర్వాతనే తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం జరిగిందన్నారు.
మంత్రుల బృందం (జివోఎం) సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. సంప్రదింపులు పూర్తయ్యాక ఆ అంశాలను తెలంగాణ బిల్లులో పొందుపరుస్తామని చెప్పారు. విభజన ప్రక్రియను ముఖ్యమంత్రులు అడ్డుకోలేరన్నారు.
జెడి శీలంకు సమైక్య సెగ
గుంటూరు జిల్లాలోని పొన్నూరులో కేంద్ర సహాయ మంత్రి జెడి శీలంకు సమైక్య సెగ తగిలింది. సోమవారం పొన్నూరు వచ్చిన శీలం కాన్వాయ్ను సమైక్యవాదులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. సమైక్యంధ్రకు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళన కారులను చెల్లాచెదురు చేశారు. ఈ సందర్భంగా జెడి శీలం మాట్లాడుతూ విభజనతో జరిగే అనర్థాలను కేంద్రానికి వివరించడంలో సమైక్యవాదులు విఫలమయ్యారని అన్నారు. విభజన జరిగిపోయిందని, ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. అందరూ ఒప్పుకుంటే ప్రాంతాలు విడిపోవచ్చుకాని, తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలని ఆయన కోరారు.