గదిలోకి వస్తేనే హాజరు వేస్తాడట!: కీచక అధికారి వేధింపులు భరించలేక..
విధులకు వచ్చినట్లు హాజరుపడాలంటే తన గదికి రావాల్సిందేనని కీచక పర్వానికి తెరదీసిన ప్రభుత్వ అధికారిపై పలువురు మహిళలు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆర్డీవో..
కందుకూరు: విధులకు వచ్చినట్లు హాజరుపడాలంటే తన గదికి రావాల్సిందేనని కీచక పర్వానికి తెరదీసిన ప్రభుత్వ అధికారిపై పలువురు మహిళలు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆర్డీవో.. సదరు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరుమార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కీచక అధికారిపై ఫిర్యాదు
వివరాల్లోకి వెళితే.. కందుకూరు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కొండయ్య లైంగిక వేధింపులు భరించలేకపోతున్నామని పలువురు మహిళా పారిశుద్ధ్య కార్మికులు ఆర్డీఓ మల్లిఖార్జున ఎదుట వాపోయారు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్సెల్లో ఆయన్ను కలిసి ఫిర్యాదు చేశారు.
గదికి రావాలంటూ ఒత్తిడి..
గిట్టని మహిళలు, చెప్పినట్టు వినని మహిళలను లక్ష్యంగా చేసుకుని కొండయ్య వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తన గదికి రావాలంటూ తరుచూ బలవంతం చేస్తున్నాడని, వెళ్లకుంటే మస్టర్ వేయకుండా పనికి రానట్టు నమోదు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
వేధింపులు ఆగడం లేదు..
సహచర కార్మికుల వద్ద చులకనగా మాట్లాడుతూ.. వేధిస్తున్నాడని వాపోయారు.
దీనిపై గతంలోనే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని, అయినా ఆ అధికారి వేధింపులు మాత్రం ఆపడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు.
కీచక అధికారికి ఆర్డీఓ హెచ్చరిక
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆర్డీఓ.. పద్ధతి మార్చుకోవాలని గతంలోనే శానిటరీ ఇన్స్పెక్టర్ను హెచ్చరించానని, మార్పు రాకుంటే ప్రభుత్వానికి ఆయన్ను సరెండర్ చేస్తానని హెచ్చరించారు. రెండు, మూడు రోజుల్లో మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి విచారిస్తానని హామీ ఇచ్చారు. సమావేశం ఎప్పుడు నిర్వహించేది కార్మికులకు తెలియజేస్తామని, ఆ రోజు వచ్చి తమ ఇబ్బందులు చెప్పాలని ఆర్డీఓ కార్మికులకు సూచించారు.