తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి సందడి: కోడిపందాల హడావిడి..రోడ్లపై వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్
ఏపీలో సంక్రాంతి పండుగ చాలా ఘనంగా జరుగుతోంది . సంక్రాంతి పండుగకు చాలా మంది ప్రజలు ఏపీలోని సొంత ఊళ్లకు చేరుకున్నారు . ఇక తెలుగు వాళ్ళు చాలా ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ సందర్భంగాసొంతూళ్లకు బయలుదేరిన ప్రయాణీకులు, అలాగే కోడిపందాలను చూడాలని వెళ్తున్న వారు ట్రాఫిక్ జామ్ లతో పడరాని పాట్లు పడుతున్నారు . బస్సులు, కార్లు ఒకటేమిటి అన్ని వాహనాలతో రహదారులు క్రిక్కిరిసిపోయాయి. ప్రతీ సంవత్సరం కంటే ఈ సారి కాస్త రద్దీ తగ్గినట్టు కనిపించినా ట్రాఫిక్ జామ్ లు మాత్రం చోటు చేసుకుంటున్నాయి.
కోడిపందాల ఎఫెక్ట్ ... భారీగా ఉభయగోదావరి జిల్లాలలో ట్రాఫిక్ జామ్ లు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈరోజు భోగి సందర్భంగా భోగి మంటలు వేసి సంక్రాంతికి స్వాగతం పలికిన తెలుగువారు పండుగ హడావిడి లో బిజీగా ఉన్నారు. తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి జిల్లాలలో కోడి పందేలు కొనసాగుతున్న వేళ కోడి పందేలను చూడ్డానికి భారీగా తరలి వెళ్తున్నారు. ఇక మరో పక్క సంక్రాంతి సందర్భంగా ప్రయాణాలు చేస్తున్న వారితో రోడ్లు ట్రాఫిక్ తో క్రిక్కిరిసి పోతున్నాయి. పండుగ సమయంలో ప్రైవేటు బస్సులు చార్జీలను పెంచి వీరబాదుడుకు తెరతీశాయి.
సంక్రాంతి ప్రయాణాలతో విజయవాడ హైవే మీద ట్రాఫిక్ జామ్
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు విజయవాడ హైవే మీద ట్రాఫిక్ జామ్ కిలోమీటర్ల మేర అవుతుంది . తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే ఈ పండుగ కోసం తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు అంతా ఒక్కసారే ప్రయాణాలు సాగించటమే దానికి కారణంగా తెలుస్తుంది . మొన్నటి వరకు కరోనా దెబ్బకు ప్రయాణాలు అంటేనే భయపడిన చాలా మంది ఇప్పుడు సొంత ఊర్లకు వెళ్ళటానికి ఉత్సాహంగా ప్రయాణాలు సాగిస్తున్నారు.
హైదరాబాద్, విజయవాడ 65 నెంబర్ జాతీయ రహదారిపై వాహన రద్దీ
కరోనా దెబ్బకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బదులు సొంత వాహనాలు కొనుగోలు చేసుకున్న వారు సొంతూర్లకు వెళ్ళటంతో హైవేలు రద్దీగా మారాయి. అంతకాదు హైదరాబాద్ నగరంలోని జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ బస్టాప్లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి .మరోవైపు హైదరాబాద్, విజయవాడ 65 నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద కూడా వాహనాల రద్ధీ కొనసాగుతుంది . టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులకు పండుగ కష్టాలు మొదలయ్యాయి.
కోడిపందాల కోసం జనం పరుగులు .. ట్రాఫిక్ జామ్ తో కష్టాలు
ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ పెద్ద సమస్యగా మారుతుంది . టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ అమలు అవుతున్న నేపధ్యంలో కాస్త సమయం ఆదా అవుతుంది. ఇక తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి జిల్లాలలో టోల్ గేట్ల వద్ద వాహన రద్దీ అంతా ఇంతా కాదు . కోడి పందాల కోసం జనాలు పరుగులు పెడుతుంటే ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ నెలకొంటుంది . మొత్తానికి సంక్రాంతి సందడితో పాటు వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు కూడా కొనసాగుతున్నాయి.