సంక్రాంతికి: ప్రత్యేక రైళ్లు,బస్సులు మరియు ప్రత్యేక బాదుడు కూడా...
విజయవాడ,హైదరాబాద్: సంక్రాంతి తెలుగువాళ్ల అతి పెద్ద పండుగ...సొంతూరికి దూరంగా ఎక్కడెక్కడికో ఉద్యోగాల కోసం..ఉపాధికోసం తరలి వెళ్లిన వారందరూ ఖచ్చితంగా ఈ పండగకు స్వస్థలానికి వెళ్లాలని ప్రయత్నిస్తారు. అందుకే ఆ సమయంలో అటు రైళ్లు, ఇటు బస్సులు అన్నీ విపరీతమైన రద్దీగా నడుస్తుంటాయి.
సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేకంగా సువిధ రైళ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చేందుకు ప్రత్యేక బస్సులతో పాటు వివిధ ప్రాంతాలకు మొత్తం మీద 1000 స్పెషల్ బస్సులను ఏర్పాటుచేసినట్లు ఎపిఎస్ ఆర్టీసీ తెలిపింది. ఈ నేపథ్యంలో అటు రైల్వే శాఖ, ఇటు ఆర్టీసీ సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులపై ప్రత్యేక బాదుడు కూడా షురూ చేశాయి.
సంక్రాతి పండుగకి...ప్రత్యేక రైళ్లు-ఛార్జీలు అదనం
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైళ్ల వివరాలను దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్కుమార్ తెలిపారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే...సాధారణ రైళ్ల కంటే ఈ రైళ్లలో చార్జీలు అధికంగా ఉంటాయి. హైదరాబాద్-కాకినాడ స్పెషల్ ట్రైన్ (నంబర్-07003) ఈ నెల 13న రాత్రి 8.15కు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.25 కు కాకినాడ చేరుతుంది. కాకినాడ-సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్(నంబర్-07459) ఈ నెల 18న రాత్రి 10.30కు కాకినాడ నుంచి బయలుదేరి మర్నాడు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్-నర్సాపూర్ స్పెషల్ ట్రైన్(నంబర్-82714) 12న సాయంత్రం 7.15కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.
మరి కొన్ని...స్పెషల్ ట్రైన్స్
హైదరాబాద్-కొచువెలి స్పెషల్ ట్రైన్(నంబర్-07115/07116) ఈ నెల 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24, మార్చి 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 9 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి రెండో రోజు ఉదయం 3.20కి కొచువెలి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26, మార్చి 5, 12, 19, 26, ఏప్రిల్ 2 తేదీల్లో ఉదయం 7.45కు బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం 2 గంటలకు నాంపల్లి కి చేరుకుంటుంది. అలాగే భువనేశ్వర్-కాచిగూడ స్పెషల్ ట్రైన్ (నంబర్-08411/08412) ఈ నెల 11, 18, 25 తేదీల్లో ఉదయం 11.30 కు భువనేశ్వర్ నుంచి బయలుదేరి మర్నాడు ఉదయం 8.30కు కాచిగూడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 12, 19, 26 తేదీల్లో మధ్యాహ్నం 3.45కు బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం 1.15కు భువనేశ్వర్కు చేరుతుంది. సికింద్రాబాద్-గూడూరు స్పెషల్ ట్రైన్(నంబర్-02710)..ఈ నెల 11న సాయంత్రం 7.15కు బయలుదేరి మర్నాడు ఉదయం 6.40కి గూడూరు చేరుతుంది. విజయవాడ-సికింద్రాబాద్ మధ్య నడిచే పలు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నారు.
ప్రత్యేక బస్సులు...సర్వీసులు..ఇలా
సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్ టిసి) కృష్ణా రీజియన్ భారీ సంఖ్యలో దూర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. అందుకు షెడ్యూల్ కూడా ప్రకటించింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం ప్రాంతాలతోపాటు లోకల్గా రాయలసీమ, రాజమండ్రి సెక్టార్లకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. గత ఏడాది 947 బస్సులు నడపగా ఈ ఏడాది 1000కి పైగా నడపాలన్న లక్ష్యాన్ని రీజియన్ అధికారులు నిర్దేశించుకున్నారు. అలాగే 24 గంటలపాటు అధికారులు విధులు నిర్వహించేలా ఉన్నతాధికారులు డ్యూటీ చార్టు తయారు చేశారు.బస్స్టేషన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, బస్సుల పరంగా సమాచారం కోసం 9959225454, 99592 25467 నెంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు.
హైదరాబాద్ వైపే... 610 బస్సులు
దూర ప్రాంతాల్లో ప్రధాన రూట్ అయిన హైదరాబాద్కు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించారు. అమరావతి, గరుడ ప్లస్, గరుడ, వె న్నెల స్లీపర్, ఇంద్ర బస్సులతోపాటు ఈనెల పదో తేదీన 66 బస్సులు, 11న 71, 12న 72, 14న 100, 15న 100, 16న 100, 17న 100 బస్సులు నడపనున్నారు. హైదరాబాద్కు రోజూ పీఎన్బీఎస్ నుంచి 180 షెడ్యూల్ సర్వీసులు నడుస్తున్నాయి. అదనం గా ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఈ బస్సులకు కరెంట్, అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించారు.
చెన్నై రూట్ లో...విశాఖ వైపు
హైదరాబాద్ తర్వాత ఈ రీజియన్లో రెండో ప్రధాన రూట్ చెన్నై. ఈ రూట్లో 105 ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఈనెల 10 వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రోజుకు 15 బస్సులు నడపాలని నిర్ణయిచారు. మధ్యలో ఒక్క శనివారం మినహా మిగిలిన ఏడు రోజులు ఈ బస్సులు తిరగనున్నాయి. అలాగే విశాఖపట్నం సెక్టార్కు 80 బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో రోజూ 20 బస్సుల చొప్పున మొత్తం 60 బస్సులు, మధ్యలో శనివారం మినహా, ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు రోజుకు ఐదు చొప్పున మొత్తం 20 బస్సులు నడపనున్నారు. బెంగళూరు సెక్టార్కు 35 ప్రత్యేక బస్సులు నడపాలని, రోజూ ఐదు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు.
రైళ్లలో...బస్సుల్లో...ప్రత్యేక బాదుడూ షురూ
సంక్రాంతి పండుగ సందర్భంగా నడిపే ప్రత్యేక రైళ్లలో సాధారణ రైళ్ల కంటే చార్జీలు అధికంగా ఉంటాయన్న విషయాన్నిగమనించాలి. రైల్వే స్టేషన్లకు పెరగనున్నరద్దీని దృష్టిలో ఉంచుకొని ప్లాట్ఫామ్ టికెట్ ధరలను కూడా రెట్టింపు చేశారు. ఈ నెల 11 నుంచి 17 వరకు సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ స్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్ ధరలను రూ.10 నుంచి రూ.20కి పెంచారు. మరోవైపు సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో కూడా ప్రత్యేక బాదుడు ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో 1000కి పైగా నడుపుతున్న బస్సుల్లో 50శాతం చార్జీ అదనంగా వసూలు చేస్తోంది.
ఎపిఎస్ ఆర్టీసీపై..విమర్శలు...
అయితే ప్రత్యేక బస్సుల్లో ఇలా అధిక ఛార్జీలు వసూలు చెయ్యడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే తిరుగు ప్రయాణంలో ప్రయాణికులు ఈ స్థాయిలో ఉండరన్న ఉద్దేశంతోనే ఛార్జీలు అధికంగా వసూలు చేయాల్సి వస్తోందని అధికారులు అంటున్నారు. వాస్తవానికి తిరుగు ప్రయాణంలో కూడా రద్దీగా ఉండే సమయాలను చూసుకునే ఆపరేషన్స్ చేపడుతున్నారనేది ప్రయాణికుల ఆరోపణ. అలాగే గుట్టుచప్పుడు కాకుండా ఆర్టీసీ ప్రయాణికుల నుంచి మరోరకంగా కూడా డబ్బులు దండుకుంటోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రత్యేక బస్సుల్లో వసూలు చేసే 50శాతం అదనపు చార్జీలు షెడ్యూల్ బస్సుల్లో కూడా వసూలు చేస్తున్నారని అంటున్నారు. కారణం ఏవి షెడ్యూల్ బస్సులో...ఏవి ప్రత్యేక బస్సులో...ఆర్టీసీ వారే చెబితే తప్ప సాధారణ ప్రయాణికులకు తెలియక పోవడమే దీనివెనుకున్న మతలబుగా చెబుతున్నారు.