'అన్నయ్య' కోసం 'సర్దార్': ఊహాగానాలు నిజమయ్యేనా, దేనికి సంకేతం?
హైదరాబాద్: మెగా సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్లు రాజకీయంగా కూడా ఒక్కటవుతారా? అనే చర్చ సాగుతోంది. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలపడం, అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అన్నయ్యకు దూరం పాటించడం, 2014 ఎన్నికల సమయంలో టిడిపి - బిజెపికి మద్దతివ్వడం తెలిసిందే.
మెగా కుటుంబ సభ్యుల పలు సినిమా ఫంక్షన్లకు పవన్ కళ్యాణ్ గతంలో హాజరు కాలేదు. అందుకు అన్నయ్య, తమ్ముడు మధ్య రాజకీయ విభేదాలే కారణమనే వాదనలు వినిపించాయి. పవన్ రాకపోవడంపై మెగా కుటుంబ సభ్యులు ఆడియో ఫంక్షన్ వేదికలపై పలుమార్లు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: ముఖ్యమంత్రిగా చిరంజీవి, అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్?
చిరంజీని తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో చేర్చడాన్ని మాత్రమే పవన్ కళ్యాణ్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, అన్నయ్య అంటే అతనికి ఎంతో అభిమానమనే విషయం పలు సందర్భాల్లో అతని మాటల ద్వారా వెల్లడయింది.
ఏపీ రాజధాని భూములను చంద్రబాబు ప్రభుత్వం లాక్కుంటుందనే ఆరోపణలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్వేగంగా మాట్లాడారు. తండ్రి తర్వాత తండ్రి అయిన తన అన్నయ్యను కూడా కాదని బిజెపి-టిడిపికి తాను ప్రజల కోసం మద్దతిచ్చానని ఆవేదనగా చెప్పారు.
Also Read: బ్రదర్స్పై ప్రచారం: జగన్వైపు చిరు, రూ.100కోట్ల తర్వాత పవన్ ఫుల్స్టాప్?
అయితే, ఇటీవల పరిణామాలు మారుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. చిరంజీవి బిజెపిలో చేరుతారని ఊహాగానాలు వచ్చాయి. వాటిని మెగాస్టార్ ఖండించారు. అయినప్పటికీ.. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చునని, చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిజెపి ప్రకటిస్తే, పవన్ కళ్యాణ్ జోరుగా ప్రచారం చేసే అవకాశాలు కొట్టిపారేయలేమనే వాదనలు వినిపించాయి.
ఇలాంటి ఊహాగానాలు వస్తుండగానే, ఇన్నాళ్లు మెగా కుటుంబ సభ్యుల సినిమా ఫంక్షన్లకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్, తన సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల కార్యక్రమానికి మాత్రం చిరంజీవి వస్తారని ప్రకటించారు. సినిమా పరంగా పక్కన పెడితే, రాజకీయంగా కూడా అన్నయ్య, తమ్ముడు ఒక్కటవుతున్నారనేందుకు ఇది సంకేతమా అనే చర్చ సాగుతోంది.