సర్పంచ్ భర్త దాడిలో గాయపడ్డ గ్రామ కార్యదర్శి, విదేశీ పర్యటనకు యనమల
అమరావతి: తప్పుడు బిల్లులకు అనుమతి నిరాకరించిందని పంచాయితీ కారదర్శిపై సర్చంచ్ భర్త దురుసుగా ప్రవర్తించి, ఆమెను గాయపరిచాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిడుముక్కల గ్రామానికి చెందిన సర్పంచ్ రవికుమారి భర్త మహేశ్వరరావు, భార్య స్ధానంలో అనధికారిక సర్పంచ్గా చెలామణి అవుతున్నారు. ఈ క్రమంలో తప్పుడు బిల్లులపై తాను చెప్పిన ఫైళ్లపై సంతకాలు పెట్టాల్సిందిగా, గత కొన్ని రోజులుగా గ్రామ కార్యదర్శి కె.అనురాధపై ఒత్తిడి తెస్తున్నారు.
తప్పుడు బిల్లులపై సంతకాలు చేయడానికి ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన సర్పంచ్ భర్త మహేశ్వరరావు తన చేతిలో ఉన్న ఫైళ్లను ఆమె మీదకు విసిరాడు. ఈ క్రమంలో ఆ ఫైళ్లు ఆమె కంటికి తగిలాయి. దీంతో వారిద్దరి మధ్య కొద్దిపాటి వాగ్వాదం చోటు చేసుకుంది.
దీంతో మనస్తాపానికి గురైన గ్రామ కార్యదర్శి కె.అనురాధ మండలంలోని కార్యదర్శులందరిని సంప్రదించిన ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలి: మాజీ ఎంపీ చింతామోహన్
దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం, ఓ ప్రైవేటు పోర్టు యాజమాన్యం అడ్డంకులు సృష్టిస్తున్నాయన్నారు.
లక్ష ఉద్యోగాలకు అవకాశం ఉన్న ఈ పోర్టు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తిరిగే హెలికాప్టర్, విమానాన్ని ఓ ప్రైవేటు పోర్టు యాజమాన్యమే సమకూరుస్తోందని ఆయన ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధినీ చేయలేదన్నారు.
విదేశీ పర్యటనకు యనమల
ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమలరామకృష్ణుడు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 11 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పర్యటించనున్నారు. వ్యాట్, జీఎస్టీ అధ్యయనంపై పరిశీలనకు వెళ్తున్న కేంద్ర ప్రభుత్వ బృందంలో సభ్యుడిగా యనమల ఈ పర్యటనకు వెళ్తున్నారు.