ఆగస్టు 1తో ముగుస్తున్న సర్పంచుల పదవీకాలం:ప్రభుత్వం ఏం చేయనుంది?
Recommended Video
అమరావతి:రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ల పదవీకాలం ఆగస్టు 1వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో పంచాయతీల్లో తదుపరి పాలన ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది. సర్పంచ్ల పదవీకాలం పూర్తవుతున్నా పంచాయతీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయం వెలువడక పోవడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో 12,850 చోట్ల సర్పంచ్ల పదవీకాలం ఆగస్టు 1వ తేదీతో ముగియనుంది. వీటిలో అధికారం ఎవరికి అప్పగిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇందుకు సంబంధించిన ఫైల్ సిఎం చంద్రబాబు వద్ద దాదాపు నెల రోజులుగా పెండింగ్లో ఉందని అధికారవర్గాలు అభిజ్ఞ వర్గాల భోగట్టా. దీంతో ఈ విషయమై సిఎం నిర్ణయం ఎప్పుడువెలువడుతుందా?...అనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికలకు...మొగ్గు చూపలేదు
సర్పంచ్ ల పదవీకాలం ముగింపు తేదీ దగ్గరపడిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పది నెలల ముందు నుంచే కసరత్తు ప్రారంభించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఎన్నికలకు సంబంధించి కీలకమైన రిజర్వేషన్ల అంశం తేలకపోవడంతో టీడీపీ సర్కారు ఎన్నికల వాయిదాకే మొగ్గు చూపింది.
మూడు రకాల...ప్రతిపాదనలు
ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో పంచాయతీల్లో సర్పంచ్ ల పదవీకాలం ముగిసాక తీసుకోవాల్సిన నిర్ణయం విషయమై అధికారులు మూడు రకాల ప్రతిపాదనలు సిఎం ముందు ఉంచారట. వీటిపై ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా అధికారులు పంచాయతీల్లో పాలనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారని తెలుస్తోంది.
ఆ మూడు ప్రతిపాదనలు...ఇవీ
పదవీకాలం ముగిసే సర్పంచులనే పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగించాలా..?...లేక ప్రత్యేకాధికారులను నియమించాలా? లేదంటే సర్పంచ్లు, వార్డు సభ్యులతో కలిసి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలా?...అనే ఈ మూడు ప్రతిపాదనలతో పంచాయితీరాజ్ శాఖ ఉన్నతాధికారులు నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక అందజేశారని తెలిసింది.
అధికారుల్లో ఉత్కంఠ...ఏం జరుగుతుంది?
అయితే బుధవారంతో సర్పంచ్ ల పదవీకాలం ముగియనుండటం...సిఎం నిర్ణయం ఇంకా వెలువడకపోవడం తో ఈ విషయమై అధికారులు హైరానా పడుతున్నట్లు తెలిసింది. సోమవారం సాయంత్రంలోగా సిఎం చంద్రబాబు నుంచి నిర్ణయం వెలువడుతుందని ఆశించినా అలా జరగలేదు. ఈ నేపధ్యంలో మంగళవారం ఖచ్చితంగా నిర్ణయం వెలువడుతుందని అధికారులు ఆశిస్తున్నారు. అయినా సిఎం నిర్ణయానికి అమలు చేయడానికి కనీసం రెండు మూడు రోజులైనా సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా ఆ నిర్ణయం ఏమిటనేది అటు రాజకీయంగా ఇటు అధికారుల్లోనూ ఉత్కంఠను కలుగజేస్తోంది.